అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇరుముడితో విమాన ప్రయాణానికి కేంద్రం అనుమతి
విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర విమానాయాన శాఖ శుభవార్త చెప్పింది. దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.
అయ్యప్ప భక్తులకు కేంద్ర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరుముడి తీసుకెళ్లే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వెళ్లే స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించిన కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
భారత పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం (image source (AISATS))
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
“శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
“మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం, మరియు ఆత్మగౌరవం కల్పించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం” అని పేర్కొన్నారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపాల్సి ఉండేది. ఫలితంగా అయ్యప్ప భక్తులు అసౌకర్యానికి గురయ్యేవారు. అయ్యప్ప భక్తుల విజ్ఞప్తుల నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన విమానాయానశాఖ… ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రత్యేక సడలింపు నవంబర్ 28వ తేదీ నుంచి నుంచి జనవరి 20 వరకు అమల్లో ఉండనుంది. ఈ కాలంలో శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు…. ఎయిర్పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసిన అనంతరం, తమ ఇరుముడిని చేతి సామానుగా విమాన క్యాబిన్లో తమతో పాటు తీసుకెళ్లొచ్చు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియల విషయంలో అధికారుల సూచనలను కచ్చితంగా అనుసరించాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అయ్యప్ప భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News/Andhra Pradesh/అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇరుముడితో విమాన ప్రయాణానికి కేంద్రం అనుమతి
News/Andhra Pradesh/అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇరుముడితో విమాన ప్రయాణానికి కేంద్రం అనుమతి