6 జోన్‌లు, 2 మల్టీ జోన్‌లు.. కొత్త నిబంధనలు అమల్లోకి.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే!

Employee Locality : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు సంబంధించిన జోనల్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పాత నిబంధనలను రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్త గెజిట్‌ను విడుదల చేసింది.

Published on: Apr 21, 2026 9:32 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమల్లో ఉన్న జోన్‌ల విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేసిది. దీంతో రాష్ట్రంలో 26 జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. 1975 నాటి పాత ఆర్డర్ స్థానంలో 'ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2005' అమల్లోకి రావడంతో ఉద్యోగాల కేటాయింపులో పెనుమార్పులు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ముఖ్యమైన మార్పులు ఇవే

ఇప్పటివరకు జిల్లా స్థాయిలో 80 శాతం, జోనల్ స్థాయిలో 70 శాతం ఉన్న స్థానిక కోటాను ఇకపై అన్ని స్థాయిల ప్రత్యక్ష నియామకాల్లో 95 శాతానికి పెంచారు. మిగిలిన 5 శాతం మాత్రమే ఓపెన్ కేటగిరీ కింద ఉంటుంది.

వచ్చే 27 నెలల్లోపు అన్ని పోస్టులను కొత్త కేడర్‌లలోకి సర్దుబాటు చేయాలని కేంద్రం స్పష్టమైన గడువు విధించింది.

పోస్టుల వర్గీకరణ

కొత్త నిబంధనల ప్రకారం జూనియర్‌ అసిస్టెంట్, దానికి సమానమైన, దానికంటే తక్కువస్థాయి పోస్టులకు(నాన్‌ గెజిటెడ్‌), ఉపాధ్యాయ పోస్టులకు జిల్లా యూనిట్‌గా పరిణగిస్తారు. అదే జూనియర్‌ అసిస్టెంట్‌ కంటే పైస్థాయి నుంచి సూపరింటెండెంట్‌ వరకు, ఒకటో స్థాయి గెజిటెడ్‌ పోస్టులకు జోన్‌ యూనిట్‌గా చూస్తారు. ఇక ఆ పై స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్‌ వరకు, వాటికి సమానమైన పోస్టులకు మల్టీ జోన్‌ను లోకల్‌ ఏరియా/కేడర్‌ యూనిట్‌గా చూడాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా.. రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉన్నవి ఇకపై మల్టీజోన్‌ పోస్టులుగా అవుతాయి.

మినహాయింపులు: ఏపీ సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, ప్రత్యేక కార్యాలయాలు, రాజధాని ప్రాంత పోలీస్ ఉద్యోగాలకు లోకల్ నిబంధనలు వర్తించవు.

కొత్త జోన్‌ల విభజన ఇలా..

రాష్ట్రంలోని 26 జిల్లాలను రెండు మల్టీ జోన్‌లుగా, ఆరు జోన్‌లుగా విభజించారు.

మల్టీ జోన్ - 1

జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి.

జోన్ 2: అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ.

జోన్ 3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా.

మల్టీ జోన్ - 2

జోన్ 4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు.

జోన్ 5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప.

జోన్ 6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి.

రాష్ట్రంలో కొత్తగా మరో రెండు జిల్లాలు ఏర్పడటంతో, మొత్తం 28 జిల్లాలకు అనుగుణంగా కొత్త గెజిట్ నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం మళ్లీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. ఒకవేళ స్థానిక అభ్యర్థులు లభించకపోతే, ఆ పోస్టులను 3 ఏళ్ల వరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. కనీసం ఒక పోస్టునైనా ఓపెన్‌ కేటగిరీగా ఉంచాలనే నిబంధన ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More