అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ.. ఎన్ని కిలో మీటర్లంటే?
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని గుర్తుచేశారు.
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు గిరి ప్రదక్షిణపై ఆసక్తి పెరిగింది. అందులో భాగంగా ఎక్కువగా తమళినాడు రాష్ట్రంలోని అరుణాచలం ఎక్కువగా వెళ్తున్నారు భక్తులు. అరుణాచలం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నమ్ముతారు. అలాంటి ప్రదేశంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ గిరి ప్రదక్షిణ చేయవచ్చు.

శ్రీకాళహస్తిలో 22 కిలో మీటర్ల గిరి ప్రదక్షిణను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. భక్తులకు ఇది ఒక మంచి అవకాశం. చాలా మంది పౌరులు ఈ చర్యను స్వాగతిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయం చుట్టూ 22 కి.మీ. గిరిప్రదక్షిణ మార్గాన్ని సచివాలయం నుండి ఉప ముఖ్యమంత్రి వర్చువల్ మోడ్లో ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), అరణి శ్రీనివాసులు (తిరుపతి), దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్లాల్తో కలిసి ప్రారంభించారు.
తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం) ఆలయంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు చేసే గిరి ప్రదక్షిణ తరహాలో శ్రీకాళహస్తి కొండ చుట్టూ ఆధ్యాత్మిక నడక అనే భావనను ప్రోత్సహించడానికి సుమారు రూ.10 కోట్ల ఖర్చుతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేశారు. మహాశివరాత్రి పండుగ తర్వాత సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతామని పవన్ కళ్యాణ్ అన్నారు.
'శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి తప్పకుండా వస్తాను. వైసీపీ హయాంలో కొన్ని ఆలయాల్లో అపచరాలు చాలా జరిగాయి. పాలకమండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కావు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా పాలకమండళ్లు పని చేయాల్సిన అవసరం ఉంది. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతీ భక్తునికి గిరి ప్రదక్షిణతో కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలి. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం.' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
దేవాలయాల నిర్వహణ, సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత ట్రస్ట్ బోర్డులు, దాని సభ్యులపై స్పష్టంగా ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేవాలయాల నిర్వహణ, హిందూ ధర్మ రక్షణను నిర్ధారించాలనే ఎన్డీఏ పాలన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ, రాజకీయేతర వ్యక్తులతో ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా పుణ్యక్షేత్రాలను నిర్వహించాల్సిన అవసరాన్ని పవన్ నొక్కి చెప్పారు.

E-Paper












