Sign in

విశాఖలో నీటి కొరత.. అందుబాటులోకి డయల్-ఎ-ట్యాంకర్ సేవలు!

విశాఖపట్నం నగరంలో ప్రస్తుతం నెలకొన్న తాగునీటి కొరతను పరిష్కరించేందుకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అత్యవసర చర్యలను చేపట్టింది. డయల్ ఎ ట్యాంకర్ తీసుకొచ్చింది.

Published on: Aug 7, 2026, 05:54:21 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) నగరంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించడానికి అత్యవసర చర్యలు చేపట్టింది. పౌరులకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరవాసులకు త్వరితగతిన, సులభంగా వాటర్ ట్యాంకర్లను అందించేందుకు నీటి సరఫరా విభాగం డయల్-ఎ-ట్యాంకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జీవీఎంసీ
జీవీఎంసీ

ఈ సేవలకు మొదటి రోజే విశేష స్పందన లభించిందని, సాయంత్రం 7 గంటల సమయానికి కార్పొరేషన్ సిటీ ఆపరేషన్స్ సెంటర్‌లో సుమారు 245 బుకింగ్‌లు నమోదయ్యాయని కమిషనర్ పేర్కొన్నారు. నీటి అవసరం ఉన్నవారికి సకాలంలో ట్యాంకర్లు అందేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రజలు జీవీఎంసీ సిటిజన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నీటి ట్యాంకర్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ డిజిటల్ వేదిక ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులు చేసి, బుకింగ్ రిఫరెన్స్ నంబర్‌ను పొందవచ్చని, జీవీఎంసీ ఆఫీసులకు వెళ్లకుండానే స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చని వివరించారు.

పారదర్శకతను కాపాడేందుకు ఫస్ట్-ఇన్, ఫస్ట్-ఔట్ విధానంలో మాత్రమే బుకింగ్‌లను ప్రాసెస్ చేస్తామని కేతన్ గర్గ్ స్పష్టం చేశారు. నీటి సరఫరాను సమర్థవంతంగా అమలు చేయడానికి 11 ప్రాధాన్యత ప్రాంతాలలో నిరంతర పర్యవేక్షణ కోసం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లను రంగంలోకి దించారు.

సిటీ ఆపరేషన్స్ సెంటర్ శాస్త్రీయ మ్యాపింగ్ విధానం ద్వారా నీరు నింపే పాయింట్లు, సరఫరా చేయాల్సిన ప్రాంతాలను గురిస్తారు. దీనివల్ల ట్యాంకర్ల రవాణా వేగవంతమై త్వరగా నీరు అందుతుంది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపిన కమిషనర్, ప్రజలు నీటిని పొదుపుగా వాడుతూ అధికారులకు సహకరించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు జీవీఎంసీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

జీవీఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0009 లేదా ల్యాండ్‌లైన్ నంబర్ 0891-2762876కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు.

మరోవైపు విశాఖపట్నం నగరవ్యాప్తంగా అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నీటి ట్యాంకర్ యజమానులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని అన్యాయమైన ధరలు వసూలు చేస్తున్నారు. జలాశయాలు, భూగర్భ జలాల మట్టాలు తగ్గడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లోని బోర్‌వెల్‌లు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పైపుల ద్వారా నీటి సరఫరా రెండు మూడు రోజులకు ఒకసారికి తగ్గిపోయింది. దీంతో నివాసితులు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడవలసి వస్తోంది. జీవీఎంసీ తీసుకొచ్చిన డయల్ ఎ ట్యాంకర్ సర్వీసుతో నగరవాసులకు ఉపశమనం దొరకనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More