Gunde Ninda Gudi Gantalu Today Episode: శివ దొంగతనం వెనుక ప్రభావతి.. ఇంటికి పోలీసులు.. అసలు దొంగ మనోజ్ అని చెప్పిన బాలు

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 30 ఎపిసోడ్ లో శివ దొంగతనం వెనుక అసలు కారణం ప్రభావతే అని బాలు బయటపెడతాడు. అంతేకాదు అసలు దొంగ మనోజ్ అని చెబుతాడు. దీంతో సత్యం షాక్ తింటాడు.

Mar 30, 2026, 07:52:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఆత్మహత్య చేసుకోబోయిన శివను బాలు కాపాడతాడు. అటు మీనాను ఇంటికి తీసుకొస్తాడు. ఈ విషయంలో ప్రభావతి, మనోజ్ లతో గొడవ అవుతుంది. దీంతో తండ్రికి వివరణ ఇవ్వబోయిన బాలు దీనంతటికీ కారణం ప్రభావతే అని స్పష్టం చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: శివ దొంగతనం వెనుక ప్రభావతి.. ఇంటికి పోలీసులు.. అసలు దొంగ మనోజ్ అని చెప్పిన బాలు
Gunde Ninda Gudi Gantalu Today Episode: శివ దొంగతనం వెనుక ప్రభావతి.. ఇంటికి పోలీసులు.. అసలు దొంగ మనోజ్ అని చెప్పిన బాలు

బాలుని నిలదీసిన ప్రభావతి, మనోజ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (మార్చి 30) ఎపిసోడ్ బాలుని ప్రభావతి, మనోజ్ నిలదీసే సీన్ తో మొదలవుతుంది. నీ బామ్మర్ది దొంగతనం చేశాడు.. నువ్వు దానిని తెలిసి కూడా బయటపెట్టలేదు అంటూ ప్రభావతి, మనోజ్.. బాలుపై మండి పడతారు.

దాని గురించి తర్వాత మాట్లాడదాం కానీ మీనా ఎక్కడ అని బాలు అడుగుతాడు. అక్కడే ఉందని, ఇక్కడికి రావద్దని చెప్పి వచ్చానని ప్రభావతి చెబుతుంది. మీనా ఏం తప్పు చేసిందని, ఆమె తన భార్య అని, ఈ ఇంట్లో ఉండే హక్కు ఆమెకు ఉందంటూ మీనాను తీసుకురావడానికి బాలు వెళ్లిపోతాడు.

శివ కోసం వెతుకుతున్న పోలీసులు

మరోవైపు శివ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులు కూడా ఆ వీడియో చూస్తారు. ఆ వీడియో చూసిన జనం పోలీసులు ఏం చేస్తున్నారని నిందిస్తున్నారని, వాడిని ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. శివ అడ్రెస్ తెలుసుకోవాలని కానిస్టేబుళ్లకు ఎస్సై చెబుతాడు. వాళ్లు శివను వెతికే పనిలో ఉంటారు.

బాలుకి పార్వతి, సుమతి క్షమాపణ.. కాళ్లు పట్టుకున్న మీనా

ఇటు మీనా కోసం అత్తింటికి వస్తాడు బాలు. అతన్ని చూడగానే పార్వతి, సుమతి క్షమాపణ చెబుతారు. మీరు శివ చెయ్యి విరగ్గొట్టడం వెనుక కారణం ఇదీ అని తెలియక నానా మాటలు అన్నామని, క్షమించమని వాళ్లు అడుగుతారు. అటు మీనా కూడా కంటతడి పెడుతూ బాలు కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరుతుంది. దీంతో బాలు వాళ్లకు సర్ది చెబుతాడు. అప్పట్లో తెలియక చేశాడని, ఇప్పుడు మారిపోయాడు కదా.. అదే కదా మనకు కావాల్సింది అని వాళ్లతో అంటాడు.

శివ ఇంటికి పోలీసులు

అదే సమయంలో వాళ్లు ఇంటికి పోలీసులు వస్తారు. శివ ఇల్లు ఇదేనా? వాడెక్కడ? అని అడుగుతారు. దీంతో శివ కావాలని ఈ తప్పు చేయలేదని, ఆ వీడియోలో ఉన్నది తన తల్లే అని, ఈ ఇంటికి, ఆ ఇంటికి గొడవల వల్లే ఇలా జరిగిందని బాలు వాళ్లతో చెబుతాడు.

అయినా సరే అది దొంగతనమే.. శివను అరెస్ట్ చేయాల్సిందే.. వాడు కావాలని దాక్కుంటే కేసు ఇంకా పెద్దదవుతుందని పోలీసులు వార్నింగ్ ఇస్తారు. శివ ఎక్కడికెళ్లాడో తెలియదని, వాడిని తానే పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తానని బాలు చెబుతాడు. దీంతో వాళ్లు వెళ్లిపోతారు.

శివను కాపాడిన బాలు

శివ ఎక్కడ అని అందరూ కంగారు పడతారు. ఇందాక తాను వస్తుంటే అతని బైక్ ఓ బిల్డింగ్ దగ్గర కనిపించిందని బాలు అంటాడు. వాడు ఏదైనా చేసుకుంటాడేమో అని అందరూ కంగారుగా పరుగెత్తుకుంటూ వెళ్తారు. అనుకున్నట్లే శివ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే అందరూ అక్కడికి వెళ్తారు. దగ్గరికి రావద్దని, వస్తే దూకేస్తానని శివ అంటాడు.

తాను చాలా పెద్ద తప్పు చేశానని, పోలీసు కేసు అయితే తనకు భవిష్యత్తే లేదని చెబుతాడు. దీంతో పార్వతి, సుమతి, మీనా ఏడుస్తూనే దూకొద్దని, ఏమీ కాదని, వెనక్కి రావాలని ప్రాధేయపడతారు. అప్పుడే బాలు వాళ్లను చూసైనా మనసు మార్చుకో.. నువ్వు చనిపోతే నీ తల్లి, అక్క ఉంటారా అంటూ అతన్ని మాటల్లో పెట్టి దగ్గరికి వెళ్లి శివను దూరంగా లాగేస్తాడు.

శివను రాజేష్ దగ్గర వదిలేసిన బాలు

ఆ తర్వాత శివను తీసుకొని బాలు, మీనా.. రాజేష్ ఇంటికి వెళ్తారు. జరిగిన విషయం చెబుతారు. కొన్నాళ్లు వీడిని ఇక్కడే ఉంచుతామని అంటారు. దానికి రాజేష్ సరే అని అంటాడు. నిజానికి ఆ వీడియోను నువ్వు డిలీట్ చేస్తానని అంటే తానే వద్దన్నానని రాజేష్ వాళ్లకు క్షమాపణ చెబుతాడు. శివను అక్కడే వదిలేసి వాడిపై ఓ కన్నేసి ఉంచాలని చెప్పి బాలు, మీనా వెళ్లిపోతారు.

బాలు, మీనా అనుమానం

కారులో ఇంటికి వెళ్తూ దీని వెనుక ఎవరో ఉన్నారని బాలు, మీనా అనుమాన పడతారు. దీని వల్ల వాళ్లకు కలిగే లాభం కంటే మనకు నష్టం జరగడమే వాళ్లకు కావాలని, అది ఎవరో తెలియాలని బాలు అంటాడు. గుణ, అతని మనుషులే చేశారా అని మీనా అడిగితే.. కాకపోవచ్చని, ఎవరో మనకి నష్టం జరగాలని కోరుకున్న వారే ఇలా చేశారని, అది ఎవరో తాను కనిపెట్టి తీరతానని బాలు అంటాడు.

ఇంట్లో మీనా కోసం బాలు ఫైట్

మీనాను బాలు ఇంటికి తీసుకొస్తాడు. ఆమెను చూడగానే ప్రభావతి, మనోజ్ చెలరేగిపోతారు. మీనాది దొంగల ఫ్యామిలీ అని ప్రభావతి నిందిస్తుంది. దీంతో బాలు కూడా రెచ్చిపోతాడు. మరి నువ్వు, మనోజ్ చేసింది ఏంటి.. మీరు దొంగలు కాదా.. అలా అయితే మనదీ దొంగల ఫ్యామిలీయే అని బాలు అంటాడు. మీనాది ఇందులో ఏ తప్పూ లేదని స్పష్టం చేస్తాడు.

తండ్రికి బాలు వివరణ

అయినా మీతో తనకు అనవసరం అని, నాన్నకు చెప్పాల్సింది ఉందని సత్యానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు బాలు. ఆరోజు శివ తన బైకు దొంగతనం చేసిన తర్వాత ఇంటికి వచ్చాడని, అప్పుడే వీళ్లందరూ వాడిని దొంగలా చూశారని అంటాడు. అది మనసులో పెట్టుకునే గుణ రెచ్చగొట్టడంతో ఆ డబ్బు దొంగతనం చేశాడు తప్ప వాడికి డబ్బుపై ఆశ లేని చెబుతాడు.

అమ్మ దగ్గర దొంగతనం చేసిన డబ్బును కూడా వాడు తిరిగి ఇచ్చేశాడని, దానిని పోలీసులు రికవరీ చేశారంటూ తాను అమ్మకు ఇచ్చేశానని అంటాడు. అసలు దొంగ ఈ మనోజ్ గాడే అని, ఆ రూ.లక్ష వాడు వాడుకున్నాడని చెబుతాడు. అసలు దీనంతటికీ కారణం అమ్మే అని కూడా ప్రభావతిని బాలు ఇరికిస్తాడు. దీంతో సత్యం ఏమీ మాట్లాడకుండా షాకవుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More