Sign in

రోడ్డుపై నీరు వదిలితే భారీ జరిమానా.. హైదరాబాద్‌లో ఓ సంస్థకు రూ.1 లక్ష ఫైన్ వేసిన జలమండలి

మురుగునీటి శుద్ధి కర్మాగారం నుండి నీటిని రోడ్డుపైకి విడుదల చేసినందుకు ఒక ప్రైవేట్ సంస్థపై హైదరాబాద్ జలమండలి భారీగా జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పేర్కొంది.

Published on: Jun 30, 2026, 14:12:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో రోడ్లపైకి మురుగునీరు లేదా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను వదిలిపెట్టే వారిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్(HMWSSB) కఠిన చర్యలు ప్రారంభించింది. నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నీటిని రోడ్లపైకి వదిలిన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 82 లోని ఒక ప్రైవేట్ వాణిజ్య సంస్థకు జలమండలి అధికారులు ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధించారు.

హైదరాబాద్ జలమండలి
హైదరాబాద్ జలమండలి

జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో జూన్ 26న జలమండలి అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సదరు కమర్షియల్ కాంప్లెక్స్ తమ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుండి వస్తున్న శుద్ధి చేసిన తర్వాత నీటిని నేరుగా బహిరంగ రహదారిపైకి వదులుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రోడ్డుపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, స్థానికంగా అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ ఉల్లంఘనపై తీవ్రంగా స్పందించిన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ(HMWSSB) సదరు యాజమాన్యానికి చట్టబద్ధమైన నోటీసులు జారీ చేసింది. తక్షణమే రోడ్డుపైకి నీటిని వదలడం ఆపాలని, నిబంధనల ప్రకారం ఆ శుద్ధి చేసిన నీటిని మొక్కలకు లేదా ఇతర అవసరాలకు పునర్వినియోగం చేయాలని ఆదేశించింది. ఈ నోటీసు అందిన 48 గంటల్లోగా వివరణతో కూడిన నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా విధించిన రూ.1 లక్ష జరిమానాను మూడు రోజుల్లోగా చెల్లించకపోతే అదనపు పెనాల్టీలతో పాటు, ఆ సంస్థకు ఉన్న తాగునీటి సరఫరా, డ్రైనేజీ కనెక్షన్లను నిలిపివేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు తీవ్రంగా హెచ్చరించింది.

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించడంతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థను పర్యవేక్షించే ప్రధాన బాధ్యత HMWSSBదే. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జలమండలి వందల మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు అత్యాధునిక ఎస్టీపీలను నిర్మిస్తోంది. నగరంలోని నాలాలు, మూసి నది కలుషితం కాకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం.

పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు శుద్ధి చేసిన నీటిని రోడ్లపైకి వదలకుండా, ఫ్లషింగ్, గార్డెనింగ్ కోసం వాడుకోవాలి. నగరంలో ఎక్కడైనా డ్రైనేజీ లీకేజీలు ఉన్నా లేదా ఎవరైనా రోడ్లపైకి నీటిని వదులుతున్నా ప్రజలు జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

నగర పరిశుభ్రత, పౌరుల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా భారీ జరిమానాలు తప్పవని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కొందరు నల్లాలకు మోటర్లు బిగిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. వారికి కూడా భారీగా జరిమానాలు విధిస్తోంది జలమండలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More