నిజమైన ప్రేమ పెద్ద కట్టడాల్లోనే కాదు.. ఇలాంటి పనుల్లోనూ కనిపిస్తుంది.. భార్య కోసం ఇంట్లోనే ఎస్కలేటర్!
ఓ వ్యక్తి చదివింది ఐదో తరగతే కానీ భార్య కోసం ఇంట్లోనే ఎస్కలేటర్ తయారుచేశాడు. ఇందుకోసం చాలా అధ్యయనం చేశాడు. భార్య మోకాలి నొప్పితో మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే పరిష్కారం చూపించాడు.
ప్రేమను వ్యక్తపరచడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద కట్టడాలు, కోటలు అవసరం లేదు. ఒక్కోసారి అది ఎంతో నిశ్శబ్దంగా.. కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధ, పట్టుదల, సృజనాత్మకత రూపంలో కూడా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్తమూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల రైతు సత్తి శివనారాయణ రెడ్డి సరిగ్గా అదే చేసి చూపించారు. తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తన 58 ఏళ్ల భార్య సత్యవేణి కోసం ఆయన చేసిన అద్భుతం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.

డిగ్రీలు లేవు.. కానీ భార్య కష్టం చూడలేక
శివనారాయణ రెడ్డికి ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, కనీసం సాంకేతిక శిక్షణ కూడా లేదు. కానీ తన భార్య ప్రతిరోజూ 21 మెట్లు ఎక్కి మొదటి అంతస్తుకు వెళ్లడానికి పడుతున్న నరకయాతనను ఆయన చూడలేకపోయారు. కేవలం 20 రోజుల్లో, 70 వేల రూపాయల ఖర్చుతో ఆయన స్వయంగా ఇంట్లోనే ఒక ‘ఎస్కలేటర్’ తయారు చేసి భార్యకు బహుమతిగా ఇచ్చారు.
గోదావరి డెల్టా పరిధిలోని మండపేట సమీపంలో ఉన్న అర్తమూరు గ్రామం పచ్చని వరిపొలాలు, కాలువలతో కళకళలాడుతూ ఉంటుంది. చిన్నప్పుడు స్కూలు చాలా దూరంగా ఉండటం వల్ల శివనారాయణ రెడ్డి కేవలం ఐదో తరగతి వరకే చదువుకోగలిగారు. అయితే చిన్నతనం నుంచే ఆయనకు యంత్రాలంటే అమితమైన ఆసక్తి. కాలక్రమేణా వ్యవసాయ పనిముట్లతో పని చేస్తూ ఆ నైపుణ్యాన్ని పెంచుకున్నారు. వ్యవసాయం చేస్తూనే.. తన ట్రాక్టర్లు, రైస్ మిల్లు మిషన్లను ఆయనే స్వయంగా రిపేర్ చేసుకుంటారు.
ఒక్క మాట.. ఒక ఆవిష్కరణ!
'వాస్తు నిపుణుల సలహా ప్రకారం ఇంటి యజమానిపై అంతస్తులోనే ఉండాలి. అందుకే మేం మొదటి అంతస్తులో ఉంటున్నాం. కానీ మోకాళ్ల నొప్పుల వల్ల నా భార్య మెట్లు ఎక్కడానికి పడే ఇబ్బంది నన్ను రోజు నిలవనీయలేదు. ఒకరోజు ఆమె నాతో.. మీరు టెక్నీషియన్ కదా, మన ఇంటి కోసం లిఫ్ట్ లాంటిది ఏదైనా తయారు చేయలేరా? అంది. ఆ మాట నా మనసులో బలంగా నాటుకుపోయింది.' అని చెప్పారు శివనారాయణ రెడ్డి.
ఎలాగైనా భార్య బాధను దూరం చేయాలనే పట్టుదలతో కొన్ని నెలల పాటు రకరకాల టెక్నాలజీలను అధ్యయనం చేశారు శివనారాయణ. ఆ తర్వాత ఒక మోటార్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామాగ్రిని కొనుగోలు చేసి.. 1.5 హెచ్పి (HP) మోటార్తో నడిచే ఒక చిన్న ఎస్కలేటర్ను సిద్ధం చేశారు. ఇది చాలా తక్కువ విద్యుత్ను వినియోగిస్తుంది. సుమారు 300 కిలోల బరువును సురక్షితంగా మోయగలదు. భద్రత కోసం ఆటోమేటిక్ స్టాప్ మెకానిజం కూడా ఏర్పాటు చేశారు. కరెంట్ పోయినా ఇబ్బంది లేకుండా 1400 VA ఇన్వర్టర్తో ఇది నడుస్తుంది. ఇప్పుడు సత్యవేణే కాదు, శివనారాయణ రెడ్డి, వారి పిల్లలు కూడా దీనినే వాడుతున్నారు.
ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి తెలిసి చాలా మంది శివనారాయణ రెడ్డికి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. దీని డిజైన్ను అడిగి తెలుసుకుంటున్నారు. మనకు పట్టుదల, ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్యను పరిష్కరించాలనే తపన ఉంటే.. సమాజానికి ఉపయోగపడే ఏదైనా సృష్టించవచ్చు అని ఆయన చెబుతారు.
కేవలం మెకానికల్ నైపుణ్యాలే కాకుండా.. శివనారాయణ రెడ్డికి సేవలోనూ మంచి పేరుంది. ఆ ప్రాంతంలోని పలు దేవాలయాల నిర్మాణానికి ఆయన ఆర్థిక సాయం చేశారు. ఆలయ ధ్వజస్తంభాలను ప్రతిష్టించడంలో ఆయన సిద్ధహస్తులు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


