బాటిల్స్, కుర్చీలు విసిరేసి ఫ్యాన్స్ రచ్చ-మెస్సీకి సారీ చెప్పిన సీఎం-ఏం జరిగిందంటే?
ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని చూసే అవకాశం దక్కలేదంటూ అభిమానులు కోల్ కతాలోని స్టేడియం ఆస్తులను ధ్వంసం చేయడం కలకలం రేపింది. బాటిల్స్, కుర్చీలకు తీసి విసిరేసారు. ఈ ఘటనపై మెస్సీకి సీఎం క్షమాపణ చెప్పడం సంచలనంగా మారింది.
దిగ్గజ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీని చూద్దామని వచ్చిన వేలాది మంది ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ కలిగింది. తమ అభిమాన ఆటగాడికి చూసుకునే అవకాశం దక్కకపోవడంతో కోపంతో ఊగిపోయారు. కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో రచ్చ చేశారు. బాటిల్స్, కుర్చీలు విసిరేశారు. ఈ ఘటన పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ కు గురయ్యారు. మెస్సీకి ఆమె క్షమాపణ తెలిపారు.

మెస్సీని చూడలేకపోవడంతో
కోల్కతా పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపం పట్ల తాను తీవ్రమైన షాక్కు గురయ్యామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. మెస్సీని సరిగ్గా చూసే అవకాశం దక్కకపోవడంతో, కొందరు అభిమానులు ఆగ్రహానికి లోనై యువభారతి క్రీడాంగణంలోకి సీసాలు, కుర్చీలు విసిరారు. ఈ ఘటనపై మెస్సీకి, క్రీడాభిమానులకు తన క్షమాపణలు తెలియజేస్తున్నానని, తాను కూడా అదే కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్టేడియం వైపు వెళ్తున్నానని బెనర్జీ ఎక్స్ లో తెలిపారు.
మెస్సీకి సారీ
"ఈరోజు సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన నిర్వహణ లోపాన్ని చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి, షాక్కు గురయ్యాను. నా అభిమాన ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీని చూసేందుకు తరలివచ్చిన వేలాది మంది క్రీడా ప్రియులు, అభిమానులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నేను స్టేడియం వైపు వెళ్తున్నాను. ఈ దురదృష్టకర సంఘటనపై లియోనెల్ మెస్సీకి, అలాగే క్రీడా ప్రియులందరికీ, ఆయన అభిమానులకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను" అని మమతా బెనర్జీ ఎక్స్ లో పోస్టు చేశారు.
విచారణ కమిటీ
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు సూచించడానికి తాను ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. ఈ కమిటీకి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి అశిమ్ కుమార్ రే నాయకత్వం వహిస్తారు. హోం, హిల్స్ అఫైర్స్ శాఖల ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. "మరోసారి క్రీడాభిమానులందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను" అని సీఎం రాశారు.
ఏం జరిగింది?
శనివారం (డిసెంబర్ 13) ఉదయం కోల్కతాలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూశారు. కానీ స్టేడియంలో ఆయన 22 నిమిషాల పాటు మెరుపులా కనిపించి వెళ్ళిపోవడంతో, సరిగ్గా చూసే అవకాశం దక్కక నిరాశకు గురయ్యారు. స్టేడియంలోని పలువురు అభిమానులు ఏమో మెస్సీని నాయకులు, మంత్రులు చుట్టుముట్టి ఆయన సమయాన్ని దోచుకున్నారని ఆరోపించారు. దీంతో అభిమానులు ఫుట్బాల్ దిగ్గజాన్ని చూసేందుకు, మాట్లాడేందుకు వారి వంతు కోసం ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి టికెట్ ధరలు రూ.18,000 వరకు చేరాయి.














