ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినందున విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనున్నారు.

ఇక రాష్ట్రంలో కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా ఈ కాలేజీలు ఏర్పాటవుతాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు తీర్పుపై కేబినెట్లో చర్చించారు. న్యాయ నిపుణుల సలహాల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.
శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 50 శాతం భరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రూ.10,547 కోట్లతో 5,566 కిలోమీటర్లు ప్రతిపాదించిన హ్యామ్రోడ్ల ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.