...
...
Next Story

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా కోసం అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ

రాష్ట్రంలోని కీలక, అత్యవసర సేవలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ కేబులింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్టుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.

Published on: Jun 11, 2026 10:07 AM IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం కీలకమని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి సూచించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

'విద్యుత్ అంతరాయాలు, తక్కువ వోల్టేజ్ సమస్యలను నివారించేందుకు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ల పనులను వేగవంతం చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా దానిని పునరుద్ధరించేలా చూడాలి. అలాగే విద్యుత్ వ్యవస్థ విశ్వసనీయతను బలోపేతం చేయాలి.' అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.

అలానే అత్యవసర సేవల విభాగాలకు ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు భూగర్భ కేబులింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విద్యుత్ అంతరాయాల వల్ల రోగులు ఇబ్బందులు పడకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

రాష్ట్రంలోని సుమారు 30 ప్రధాన ఆస్పత్రుల్లో జనరేటర్ల పనితీరును సమీక్షించి, కరెంట్ నిలిచిపోయిన సమయంలో స్విచ్ ఓవర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. అలాగే విద్యుత్ శాఖ చేపడుతున్న అన్ని అభివృద్ధి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ అంతరాయాల వల్ల భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే పునరుద్ధరణ చేయడానికి సంబంధించిన అవకాశాలను పరిశీలించాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe