నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం రోడ్డు డివైడర్ ను కొట్టి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్వాలిస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. గాయపడ్డవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తోంది. ఇక క్వాలిస్ వాహనం… తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రోడ్డు ప్రమాదంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
గుంటూరులో మరో రోడ్డు ప్రమాదం:
గుంటూరు జిల్లాలో మరో రోడ్డుప్రమాదం జరిగింది. ఆగిఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులను తెలంగాణలోని సూర్యాపేట వాసులని తెలిసింది. తిరుపతి నుంచి సూర్యాపేట వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.