శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చేసింది. స్పర్శ దర్శనాలకు సంబంధించిన టైమింగ్స్ ను పెంచాలని నిర్ణయం తీసుకుంది. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
అమలు ఎప్పట్నుంచంటే..?

తాజా నిర్ణయం ప్రకారం….. ప్రతి వారం శని, ఆదివారాలు మరియు సోమవారాల్లో మల్లన్న స్పర్శ దర్శనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ రోజుల్లో ప్రతి 2 గంటలకు ఒకసారి స్పర్శ దర్శన స్లాట్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త విధానం 2026 జనవరి నెల నుంచి అమల్లోకి రానుంది.
జనవరి నుంచి వీకెండ్స్ రోజుల్లో స్లాట్ల ద్వారా భక్తులకు స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేస్తారు. వీఐపీ బ్రేక్ ఉదయం 6 గంటల నుంచి 7 వరకు, స్పర్శ దర్శనం ఉదయం 7 గంటల నుంచి 8.30 వరకు ఉంటుంది. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 10.30-11.30 వరకు, స్పర్శ దర్శనం ఉ.11.45-మధ్యాహ్నం 2 గంటల వరకు కల్పిస్తారు. వీఐపీ బ్రేక్ రాత్రి 7.45-8 గంటల వరకు, స్పర్శ దర్శనం రాత్రి 9-11 వరకు ఉంటుందని ఆలయ ఈవో వివరించారు.
మొత్తం 5 స్పర్శ దర్శన స్లాట్లకు ఆన్లైన్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్లో టికెట్లు జారీ చేయరు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న స్వామిని స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారాంతాలు, సోమవారాల్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఆన్లైన్ సేవలను www.aptemples.ap.gov.in లేదా www.srisailadevasthanam.org లేదా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 ద్వారా మాత్రమే పొందవచ్చు. స్పర్శ దర్శనం, అర్జిత సేవలను ఆన్లైన్లో బుక్ చేసుకునే వారు టికెట్ ప్రింటెడ్ కాపీని, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని తీసుకురావాలి. టికెట్లోని QR కోడ్ను స్కాన్ చేయాలి, ఒరిజినల్ ఆధార్ కార్డ్ను చూపించాలి. ఆన్లైన్ టికెట్ను స్కాన్ చేసిన తర్వాతే దర్శనం లేదా సేవలకు ప్రవేశం అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.