గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో తహసీల్దార్ గా పని చేస్తున్న శ్రీనివాసరావు అనే అధికారి పట్టుబడ్డాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా దొరికిపోగా కేసు నమోదైంది.
రూ. 50 వేలు లంచం డిమాండ్

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. నాగిరెడ్డిపల్లి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి(ఫిర్యాదుదారుడు) తన తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయభూమిని తనపైకి మార్చుకునేందుకు ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే సంబంధిత అధికారులకు నివేదిక పంపేందుకు ఫిర్యాదుదారుడిని తహసీల్దార్(ఎమ్మార్వో) యార్లగడ్డ శ్రీనివాసరావు రూ. 50 వేలు డిమాండ్ చేశాడు.
ఈ లంచాన్ని ప్రైవేట్ వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో తీసుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. సదరు ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించగా… లంచం తీసుకుంటా తహసీల్దార్ తో పాటు అజయ్ పట్టుబడ్డారు. ఇద్దరిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఇక ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.