TG EAPCET 2nd Phase Counselling : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూలై 17వ తేదీ నుంచి రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగియడంతో…. ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఈ విడత కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నారు.
షెడ్యూల్ వివరాలు :

రెండో విడత కౌన్సెలింగ్లో భాగంగా జూలై 18వ తేదీన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) చేపడతారు. ఆ తర్వాత జూలై 18, 19 తేదీల్లో అభ్యర్థులు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆప్షన్లు నమోదు చేసుకున్న అభ్యర్థులకు జూలై 22న లేదా ఆ లోపు రెండో విడత సీట్లను కేటాయిస్తామని ప్రవేశాల కార్యాలయం స్పష్టం చేసింది.
ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థుల్లో కేవలం 60,300 మంది మాత్రమే కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపారు. వీరంతా ఆన్లైన్ ద్వారా ఫీజులు చెల్లించి, వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. నిజానికి ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 88,053 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి కోసం 88,510 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.
ఈ విద్యా సంవత్సరం (2026-27) దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే ఏఐసీటీఈ (AICTE) తెలంగాణకు అదనంగా మరో 15 వేల బీటెక్ సీట్లను మంజూరు చేసింది. ముఖ్యంగా డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ కోర్సుల్లో ఈ సీట్లు పెరిగాయి. అయితే…. ఈ అదనపు సీట్లను ప్రస్తుత కౌన్సెలింగ్లో చేర్చాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు గురువారం ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు. సీఎం ఆమోదం తెలిపితే ఈ 15 వేల సీట్లు కూడా రెండో విడత లేదా తదుపరి విడత కౌన్సెలింగ్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.