రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు సాంఘిక సంక్షేమశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా సివిల్స్ కోటించ్ తీసుకునేందుకు దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హులైన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఓ ప్రకటన ద్వారా కోరారు.
ఉచిత వసతి, భోజన సౌకర్యం…

ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం… రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇస్తారు. విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2024 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
నేటి నుంచే దరఖాస్తులు…
ఉచిత కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు నవంబర్ 16వ తేదీతో ముగుస్తుంది. అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించవచ్చు. ఇదే వెబ్ సైట్ ద్వారా మీ దరఖాస్తును సమర్పించవచ్చు.
ఇక తాజాగానే సివిల్స్ - 2025 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31వ తేదీ వరకు యూపీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహించగా… నవంబర్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించింది. మొత్తం 2,736మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఏపీ, తెలంగాణ నుంచి 150 మందిలోపు ఎంపికయ్యారని అంచనా. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 979 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబరు నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. https://upsc.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలతో పాటు మిగతా అప్డేట్స్ తెలుసుకోవచ్చు.