...
...
Next Story

Petrol price : పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఊరట- ఎక్సైజ్ సుంకం భారీగా తగ్గింపు..

అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో సామాన్యుడిపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను లీటరుకు రూ. 10 చొప్పున తగ్గించింది. దీనితో పెట్రోల్‌పై పన్ను రూ. 3కి చేరగా, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పూర్తిగా సున్నా అయింది.

Published on: Mar 27, 2026 08:43 AM IST
Advertisement

ఇరాన్ యుద్ధం సెగలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది! పెట్రోల్, డీజిల్ ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అర్థరాత్రి జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా కీలక ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది.

పెట్రోల్​, డీజిల్​పై పన్నుల కోత ఇలా..

ఓ పెట్రోల్​ బంకులో రద్దీ.. (ANI)
ఓ పెట్రోల్​ బంకులో రద్దీ.. (ANI)

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. పెట్రోల్​పై లీటరుకు రూ. 10 తగ్గించడంతో, ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం కేవలం రూ. 3 మాత్రమే. ఇక డీజిల్​పై లీటరుకు రూ. 10 తగ్గించడంతో, కేంద్రం వసూలు చేసే పన్ను ఇప్పుడు రూ. 0 (సున్నా)కు చేరింది.

ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

అయితే వీటితో పెట్రోల్​ బంకుల్లో ధరలు తగ్గకపోవచ్చని, కానీ ధరలు పెంచకుండానే చమురు మార్కెటింగ్​ సంస్థలు నష్టాలను తగ్గించుకోవచ్చని తెలుస్తోంది.

యుద్ధం తెచ్చిన ముప్పు..

ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఒకానొక సందర్భంలో బ్యారెల్‌కు ఏకంగా 119 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఇది 110 డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది. ప్రపంచ చమురు వినియోగంలో ఐదో వంతు సరఫరా అయ్యే 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' జలసంధి దాదాపు మూతపడటంతో సరఫరా వ్యవస్థ పతనమైంది. రోజుకు 120 ఓడలు ప్రయాణించే ఈ మార్గంలో ఇప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలో మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి.

చమురు కంపెనీల పరిస్థితి ఏంటి?

దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్​), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్​పీసీఎల్​) ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. దీనివల్ల ఈ కంపెనీలు లీటరు డీజిల్‌పై రూ. 50, పెట్రోల్‌పై రూ. 20 వరకు నష్టాలను భరిస్తున్నట్లు అంచనా. ఇప్పుడు ప్రభుత్వం పన్నులు తగ్గించడం వల్ల ఈ కంపెనీలకు కొంత ఊరట లభించనుంది.

ప్రైవేట్ కంపెనీల పెంపుతో ‘పానిక్ బయింగ్’!

విమాన ఇంధనం (ఏటీఎప్​) పై తొలుత లీటరుకు రూ. 50 ఎక్సైజ్ సుంకం విధించాలని ప్రతిపాదించినప్పటికీ, ప్రభుత్వం తర్వాత మినహాయింపు ఇచ్చింది. దీనివల్ల దేశీయ విమాన టికెట్ల ధరలు పెరగకుండా ఉండే అవకాశం ఉంది.

భారత్ తన ముడిచమురు అవసరాల్లో దాదాపు 88% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ 'సర్క్యూట్ బ్రేకర్' నిర్ణయం నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అడ్డుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe