...
...
Next Story

ఇంటర్ విద్యలో పెను మార్పులు.. మారిన పరీక్షల విధానం.. ఈ ఇయర్ నుంచే అమలు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పరీక్షల సరళిని పూర్తిగా మార్చేసింది.

Published on: May 14, 2026 08:54 PM IST
Advertisement

తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా రంగంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ద్వితీయ సంవత్సరంలోనే ఉండే ప్రాక్టికల్స్ (ప్రయోగాత్మక పరీక్షలు), ఇకపై మొదటి సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. కేవలం సైన్స్ గ్రూపులకే కాకుండా.. మ్యాథ్స్, హ్యుమానిటీస్ (ఆర్ట్స్) విద్యార్థులకు కూడా కొత్త అసెస్‌మెంట్ విధానాన్ని అమలు చేయనుంది.

తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్ బోర్డు

ఇకపై ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులలో ప్రాక్టికల్స్‌ను రెండు ఏళ్లూ నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టులో ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులు ప్రాక్టికల్స్ కోసం కేటాయించారు. అంటే ప్రయోగాల ద్వారా మార్కులు సాధించే అవకాశం విద్యార్థులకు పెరుగుతుంది.

మ్యాథ్స్ పరీక్షా విధానంలోనూ భారీ మార్పు వచ్చింది. థియరీ కంటే 'యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్'కు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఉన్న 75 మార్కులను 60 మార్కులకు ఫైనల్ పరీక్షలో తగ్గించారు. ఏడాదికి 15 మార్కుల చొప్పున ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయించారు. దీనివల్ల విద్యార్థులు లెక్కలను మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

హ్యుమానిటీస్ (Civics, Economics, History), భాషా విభాగాల్లో (Telugu, English, etc.) మార్కుల సరళిలో కూడా మార్పులు ఉంటాయి. ఫైనల్ పరీక్షలో 100 మార్కులకు బదులుగా 80 మార్కులకే నిర్వహిస్తారు. మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు కేటాయిస్తారు.

ఈ మార్పుల వల్ల లాభమేంటి?

ఫైనల్ పరీక్షల మార్కులు తగ్గించడం వల్ల విద్యార్థులపై ఉండే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బట్టీ పట్టే విధానం పోయి, ప్రయోగాలు చేయడం ద్వారా నేర్చుకునే విధానం అలవడుతుంది. ఇంటర్నల్ మార్కులు ఉండటం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈసారి అడ్మిషన్ల ప్రక్రియలో ప్రభుత్వం రెండు నిబంధనలను చాలా సీరియస్‌గా అమలు చేస్తోందని, ఆధార్ కార్డు, యాంటీ డ్రగ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. అడ్మిషన్ సమయంలో విద్యార్థితో పాటు వారి తల్లిదండ్రులు కూడా మేం మత్తు పదార్థాలను వినియోగించబోం, విక్రయించబోం అని రాసి ఉన్న డిక్లరేషన్ మీద సంతకం చేసి కళాశాలకు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ప్రకటనను ఎట్టి పరిస్థితుల్లోనూ నోటరైజ్డ్ అఫిడవిట్‌గా పరిగణించరాదని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ ప్రకటనను సమర్పించడం కోసం ఏ విద్యార్థి గానీ, తల్లిదండ్రులు గానీ నోటరీని సంప్రదించాల్సిన అవసరం లేదు లేదా ఎలాంటి ఖర్చు భరించాల్సిన అవసరం లేదు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe