ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకగ్రీవాలను పక్కనపెట్టగా... ఈ దశలో 3,906 పంచాయతీలకు సర్పంచ్, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈటైమ్ దాటితే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. కానీ ఈ సమయంలోపు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంటుంది. గంటపాటు భోజన విరామం తర్వాత.... కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది.
సాయంత్రం వరకు ఫలితాలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. మరోవైపు సర్పంచ్ ఓట్లను కూడా లెక్కిస్తారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే.... ఇదే సమయంలో ఉపసర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేస్తారు. వార్డుల్లో గెలిచిన అభ్యర్థుల్లో ఒకరిని ఉపసర్పంచ్ గా ఎన్నుకుంటారు.
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.... ఈ 2 విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 5 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 3,906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడుతున్నారు.
ఇక రెండో విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరంలో ఉన్న చాలా మంది ఓటర్లు తరలివెళ్లారు. శనివారం నగరంలో రద్దీ ఎక్కువగా కనిపించింది. ఉప్పల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే రోడ్డుపై రద్దీ నెలకొంది. మరికొన్ని ప్రధాన రహదారుల్లో కూడా ఇదే మాదిరి పరిస్థితి కనిపించింది. ఇక మూడో విడత పోలింగ్ ఈనెల 17వ తేదీన ఉంటుంది.