ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్డేట్ చేసుకునే గడువును మార్చి 25వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
ఇదే చివరి ఛాన్స్…

అభ్యర్థులు తప్పకుండా వారి వివరాలను నమోదు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. తర్వాత మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని పేర్కొంది. https://www.tgpsc.gov.in ద్వారా అప్డేట్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని సూచించింది.
తప్పనిసరిగా కొత్త కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదనపు విద్యార్హతలు, చిరునామా , ఈడబ్యూఎస్, నాన్-క్రీమీ లేయర్ , మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీలను మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. మిగిలిన వివరాలు మార్చడానికి వీలుండదని టీజీపీఎస్సీ పేర్కొంది. అభ్యర్థులు ఇచ్చే OTR వివరాలనే భవిష్యత్తులో ఉద్యోగ దరఖాస్తులకు ప్రాథమిక సమాచారంగా పరిగణిస్తారు…. కాబట్టి జాగ్రత్తగా పూర్తి చేయాలని కమిషన్ సూచించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లయ్ చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, ఫోటో, సంతకం వంటివి ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే ప్రక్రియ. దీనివల్ల ప్రతిసారీ వివరాలు నింపాల్సిన అవసరం లేకుండా, ఉద్యోగ నోటిఫికేషన్కు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
రూల్ ప్రకారం.. ప్రతి అభ్యర్థికి ఒకే ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఇది ఏ కారణం చేతనైనా అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుతుంది. అభ్యర్థి అదనపు అర్హతలు, కరస్పాండెన్స్ చిరునామా, కమ్యూనికేషన్లో మార్పులు, ఈడబ్ల్యూఎస్ స్టేటస్, కేటగిరీకి సంబంధించిన వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా అతని/ఆమె డేటాను యాడ్ చేయవచ్చు, మెరుగుపరచవచ్చు అని కూడా కమిషన్ తెలిపింది.