...
...
Next Story

H-1B వీసా: చిలుకూరు బాలాజీ టెంపుల్‌పై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికా సెనేటర్ ఎరిక్ ష్మిత్ H-1B వీసా ప్రోగ్రామ్‌పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని 'వీసా కార్టెల్' (ఒక రకమైన మాఫియా లేదా కూటమి) లో భాగమని అభివర్ణించడం ఇప్పుడు ఇండో-అమెరికన్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Published on: May 14, 2026 08:28 AM IST
Advertisement

భారతీయ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 'అమెరికా కల' అంటే ముందుగా గుర్తొచ్చే పేరు హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయం. వీసా ఇంటర్వ్యూకి వెళ్లేముందు ఇక్కడ ప్రదక్షిణలు చేయడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. అయితే, ఇప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని అమెరికాకు చెందిన ఓ సీనియర్ సెనేటర్ రాజకీయ వివాదంలోకి లాగారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్, H-1B వీసా విధానాన్ని విమర్శిస్తూ చిలుకూరు ఆలయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

'వీసా కార్టెల్' ఆరోపణలు

చిలుకూరు బాలాజీ ఆలయం
చిలుకూరు బాలాజీ ఆలయం

H-1B వీసా ప్రోగ్రామ్ వల్ల అమెరికన్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎరిక్ ష్మిత్ ఆరోపించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన సుదీర్ఘ పోస్ట్‌లు చేస్తూ.. గ్లోబల్ స్థాయిలో ఒక 'వీసా కార్టెల్' నడుస్తోందని పేర్కొన్నారు. ఇందులో టెక్ కంపెనీలు, రిక్రూటర్లు, ఔట్‌సోర్సింగ్ సంస్థలు కుమ్మక్కై అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులకు కట్టబెడుతున్నాయని ఆయన వాదించారు.

"పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వేల సంఖ్యలో అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ, అదే స్థానాల్లో తక్కువ జీతానికే పని చేసే H-1B వీసాదారులను నియమించుకుంటున్నాయి. ఇది అమెరికన్ల సొమ్ముతో భారత్‌లో ఏఐ (AI) శిక్షణకు సబ్సిడీ ఇవ్వడం లాంటిదే" అని ఎరిక్ ష్మిత్ ఘాటుగా విమర్శించారు.

చిలుకూరు బాలాజీ ఆలయంపై వ్యాఖ్యలు

వాల్ స్ట్రీట్ జర్నల్ గతంలో ప్రచురించిన ఒక కథనాన్ని ఉటంకిస్తూ.. హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ వ్యవస్థ ఎంతగా 'గేమ్' గా మార్చారో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

"ఈ వీసా కార్టెల్‌కు హైదరాబాద్‌లో ఒక ‘వీసా టెంపుల్’ కూడా ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు తమ పాస్‌పోర్టులకు ఆశీర్వాదం తీసుకోవడం, వీసాల కోసం ప్రదక్షిణలు చేయడం కనిపిస్తుంది. ఇంతలా ప్రభావితం చేయబడిన వ్యవస్థతో అమెరికన్ కార్మికులు పోటీ పడాల్సి రావడం అన్యాయమే అవుతుంది.." అని ష్మిత్ వ్యాఖ్యానించారు.

తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంత?

ఎరిక్ ష్మిత్ కేవలం ఆలయంపైనే కాకుండా, విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పని చేసుకునేందుకు వీలు కల్పించే OPT (Optional Practical Training) ప్రోగ్రామ్‌ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఆయన 'డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్' (DEI) విభాగాల్లో కూడా H-1B వీసాల దుర్వినియోగం జరుగుతోందని అధికారులకు లేఖ రాశారు. అమెరికాలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ, వలసదారులు, విదేశీ కార్మికులపై ఇలాంటి దాడులు మరింత పెరిగే అవకాశం ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):

1. ఎరిక్ ష్మిత్ ఎవరు? ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు?

ఎరిక్ ష్మిత్ అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్. అమెరికా ప్రాధాన్యత (America First) విధానాన్ని నమ్మే ఆయన, విదేశీయులకు ఇచ్చే H-1B వీసాల వల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని భావిస్తున్నారు. అందుకే ఈ ప్రోగ్రామ్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

2. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని 'వీసా టెంపుల్' అని ఎందుకు అంటారు?

హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్తే వీసా ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ వేలాది మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రాచుర్యం వల్ల అంతర్జాతీయ మీడియా కూడా దీనిని 'వీసా టెంపుల్'గా పిలుస్తుంది.

3. ఆయన పేర్కొన్న 'వీసా కార్టెల్' అంటే ఏమిటి?

వీసా నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, తక్కువ జీతానికే విదేశీ కార్మికులను తెచ్చుకునేందుకు టెక్ కంపెనీలు, కన్సల్టెన్సీలు కలిసి చేసే ప్రయత్నాన్ని ఆయన 'వీసా కార్టెల్' లేదా మాఫియాగా అభివర్ణించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe