...
...
Next Story

2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..

ఏపీలో 2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. కొత్త ఏడాదిలో నేరాలు మరింత తగ్గించేలా పోలీసులు పని చేస్తారని తెలిపారు.

Updated on: Dec 29, 2025 05:50 PM IST
Advertisement

2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే.. ఏపీలో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని వెల్లడించారు. మహిళలకు రక్షణ, మత్తు పదార్థాల రవాణా, సెల్‌ఫోన్లు రికవరీ.. వంటి అనేక వాటిలో పురోగతి సాధించామన్నారు డీజీపీ. కొత్త ఏడాదిలో నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

వచ్చే పది సంవత్సరాలలో పోలీసింగ్ ఎలా ఉంటుందనే దాని మీద రెండు రోజులు వర్క్‌షాపు నిర్వహిస్తామని డీజీపీ హరీశ్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా పోలీసు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తామన్నారు. సంక్రాంతి తర్వాత ఈ వర్క్‌షాపు ఉంటుందన్నారు. ఇటీవల కీలక కేసులను ప్రస్తావించడంతోపాటుగా.. ఎలా చేధించారో వివరిస్తామన్నారు.

'సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్క్ షాపు ద్వారా అందరికీ తెలియజేస్తాం. చట్టానికి అందరూ సమానమే. వ్యతిరేకంగా వెళ్లేవారిపై చర్యలు ఉంటాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నవారిపై చర్యలు తీసుకోవడమే మా విధి. సేఫ్ ఏరియా అనుకుని కొందరు నక్సలైట్లు ఏపీలోకి వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు నిఘా పెట్టి వారందరినీ పట్టుకున్నాం.' అని డీజీపీ హరీశ్ కుమార్ తెలిపారు.

సైబర్ నేరాల గురించి డీజీపీ మాట్లాడారు. చైనాలో పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయన్నారు. మోసం జరిగిన వెంటనే.. ఆ దేశానికి నగదు వెళ్లిపోతుందన్నారు. ఇటువంటి కేసుల్లో నగదు తిరిగి రావడం అనేది కష్టమైన పని, ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేంద్రం నివేదికలో 36వ స్థానంలో ఏపీ ఉందనే వార్తల్లో వాస్తవం లేదని డీజీపీ అన్నారు. ఎందుకంటే అది పాత సిస్టమ్ అని, వారి డేటాకు, మన డేటాకు మధ్య తేడా వల్ల అలా వచ్చిందని తెలిపారు. ఇప్పుడు చూస్తే డ్యాష్‌ బోర్డులో ఏపీ ఎక్కడ ఉందో తెలుస్తుందన్నారు.

నిందితులను రోడ్లపై నడిపించిన వ్యవహారంపై డీజీపీ హరీశ్ కుమార్ స్పందించారు. కోర్టులో హాజరుపరిచే సమయానికి పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో లేవన్నారు. ఈ కారణంగా కొన్ని చోట్ల నిందితులను నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉండాలనే లక్ష్యంతో పోలీసులు పని చేస్తున్నట్టుగా వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe