AP Temperatures : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భానుడు భగభగలాడుతున్నాడు. ఊళ్లు, వాడలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం(మే 21) నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఊహించని స్థాయికి చేరింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై ప్రజలను నరకప్రాయం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం జిల్లాల వారీగా నిప్పులు కురిసిన ప్రాంతాలు ఇలా ఉన్నాయి:
- పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
- బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడ ప్రాంతాల్లో 47.6 డిగ్రీల వేడి రికార్డయింది.
- ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకి పరిసరాల్లో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
- ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలుగా తీవ్రత ఉంది.
- మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
- అల్లూరి సీతారామరాజు (పోలవరం) జిల్లా కూనవరంలో 46.5 డిగ్రీల వేడి నమోదైంది.
- నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీలు, గుంటూరు జిల్లా తెనాలిలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాబోయే నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "రాష్ట్రంలో వచ్చే సోమవారం వరకు ఎండ తీవ్రత మరియు వడగాల్పులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి," అని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.