...
...
Next Story

KTM ఉద్యోగులకు షాక్: 500 మందిని తొలగించనున్న బజాజ్ మొబిలిటీ

వ్యయ నియంత్రణే లక్ష్యంగా బజాజ్ మొబిలిటీ ఏజీ కీలక నిర్ణయం తీసుకుంది. తన అనుబంధ సంస్థ KTMలో దాదాపు 500 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వైట్ కాలర్, మధ్య స్థాయి మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Published on: Jan 16, 2026 11:09 AM IST
Advertisement

ప్రముఖ ప్రీమియం బైక్ తయారీ సంస్థ KTMలో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధమైంది. బజాజ్ మొబిలిటీ ఏజీ (Bajaj Mobility AG) తన గ్లోబల్ రైట్‌సైజింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా సుమారు 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. 2025లో చేపట్టిన సంస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియ ముగియడంతో, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఎందుకు ఈ నిర్ణయం?

KTM ఉద్యోగులకు షాక్: 500 మందిని తొలగించనున్న బజాజ్ మొబిలిటీ
KTM ఉద్యోగులకు షాక్: 500 మందిని తొలగించనున్న బజాజ్ మొబిలిటీ

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) కి సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బజాజ్ ఆటో ఈ వివరాలను వెల్లడించింది. "దీర్ఘకాలికంగా మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడేందుకు, సంస్థాగత నిర్మాణాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు ఈ చర్యలు తప్పడం లేదు" అని కంపెనీ పేర్కొంది. అంతర్గత ఖర్చులను తగ్గించడం, ప్రాజెక్ట్ పోర్ట్‌ఫోలియోను పరిమితం చేయడం, అంతర్జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్ నెట్‌వర్క్‌ను పునర్వ్యవస్థీకరించడం వంటి లక్ష్యాలతో ఈ ‘రైట్‌సైజింగ్’ చేపడుతున్నట్లు వివరించింది.

ఎవరిపై ప్రభావం?

ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా వైట్ కాలర్ ఉద్యోగులు (ఆఫీస్ స్టాఫ్) మరియు మధ్య స్థాయి మేనేజ్‌మెంట్ విభాగాలపై ఉండనున్నాయి. డిసెంబర్ 31, 2025 నాటికి ఉన్న గణాంకాల ప్రకారం.. KTMలో మొత్తం 3,794 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటించిన 500 మంది తొలగింపు అంటే, సంస్థ తన మొత్తం శ్రామిక శక్తిలో గణనీయమైన భాగాన్ని తగ్గించుకుంటున్నట్లు అర్థమవుతోంది.

మెజారిటీ వాటా బజాజ్ చేతికే..

గతంలో పియరర్ మొబిలిటీ (PIERER Mobility AG) గా ఉన్న ఈ సంస్థ పేరును బజాజ్ మొబిలిటీ ఏజీగా మార్చారు. ఆస్ట్రియా కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ KTMతో పాటు హస్క్వర్నా (Husqvarna), గ్యాస్‌గ్యాస్ (GASGAS) వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లకు మాతృ సంస్థ. గత ఏడాది నవంబర్‌లో బజాజ్ ఆటో తన అనుబంధ సంస్థ ‘బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బివి’ ద్వారా KTMలో మెజారిటీ వాటాను దక్కించుకుంది. ఒకప్పుడు మైనారిటీ ఇన్వెస్టర్‌గా ఉన్న బజాజ్, ఇప్పుడు మెజారిటీ యజమానిగా మారి KTM భవిష్యత్తు వ్యూహాలను స్వయంగా నిర్దేశిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe