...
...
Next Story

సీబీఎస్‌ఈ 3-భాషల విధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఈ విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి, ఆపై తరగతులకు మూడు భాషల విధానాన్ని అమలు చేయాలన్న సీబీఎస్‌ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందించింది. పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుల కొరతను ప్రస్తావిస్తూ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వ సమాధానాన్ని కోరింది.

Published on: Jul 15, 2026 08:55 AM IST
Advertisement

సీబీఎస్‌ఈ (CBSE) ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఆరో తరగతి నుంచి ప్రవేశపెట్టిన నూతన మూడు భాషల విధానంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తగినన్ని పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుల కొరతను పేర్కొంటూ దేశవ్యాప్తంగా పలువురు తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

సీబీఎస్‌ఈ 3-భాషల విధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
సీబీఎస్‌ఈ 3-భాషల విధానంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన్ రామ్‌లతో కూడిన ఈ బెంచ్.. ఐదు, ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన రెండు కొత్త పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల ఈ విధానాన్ని అమలు చేయడం అసాధ్యమని పిటిషనర్లు వాదించారు.

పుస్తకాల కొరత.. తల్లిదండ్రుల ఆందోళన

తల్లిదండ్రుల తరఫున సీనియర్ న్యాయవాదులు గోపాల్ శంకరనారాయణన్, ఆనంద్ గ్రోవర్ కోర్టులో వాదనలు వినిపించారు.

"రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న 22 భారతీయ భాషల పుస్తకాలను కొనుగోలు చేయాలని సీబీఎస్‌ఈ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేఖలు రాసింది. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే ఇప్పటికీ కేవలం 3 భాషలకు సంబంధించిన పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయులను సమకూర్చుకోవడం పూర్తిగా అసాధ్యం" అని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

న్యాయవాదులు శ్రద్ధా దేశ్‌ముఖ్, రోహిత్ కుమార్ సింగ్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్లలో సీబీఎస్‌ఈ జారీ చేసిన సర్క్యులర్లను తప్పుబట్టారు. ఇంగ్లీష్‌ను "స్థానికేతర" (non-native) భాషగా వర్గీకరించడం రాజ్యాంగబద్ధంగా చెల్లదని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇంగ్లీష్‌ను భారతదేశానికి చెందిన స్వదేశీ భాషగా పరిగణించవచ్చా లేదా అనే అంశాన్ని తేల్చాల్సి ఉందన్నారు. ఒకప్పుడు మన దేశ న్యాయస్థానాల్లో పారశీక (Parsi) భాష అధికారిక భాషగా ఉండేదని ఈ సందర్భంగా బెంచ్ గుర్తుచేసింది.

గతంలోనూ కోర్టు నోటీసులు.. బోర్డు సవరణలు

ఈ విమర్శల నేపథ్యంలో సీబీఎస్‌ఈ జూన్ 29న ఒక కొత్త సర్క్యులర్ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులు ఎనిమిదో తరగతిలో చదివిన మూడు భాషల కాంబినేషన్‌నే కొనసాగించవచ్చని పేర్కొంది. కానీ, 2026-27, ఆ తర్వాతి బ్యాచ్‌లలో ఆరో తరగతిలో చేరే విద్యార్థులు చదివే మూడు భాషలలో కచ్చితంగా రెండు భాషలు భారతీయ భాషలై ఉండాలని స్పష్టం చేసింది. జూన్ 29 నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఈ వివాదం ఇంకా సజీవంగానే ఉందని కోర్టు అభిప్రాయపడింది.

కేంద్రం, ఎన్‌సీఈఆర్‌టీ వివరణలు

ఈ వ్యవధిలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) లు కోర్టులో ప్రత్యేక అఫిడవిట్లు దాఖలు చేశాయి. జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా బహుభాషా అభ్యాసాన్ని, జాతీయ సమగ్రతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా శాఖ పేర్కొంది. ఈ విధానాన్ని అకస్మాత్తుగా కాకుండా క్రమబద్ధంగా, దశలవారీగా అమలు చేస్తున్నామని, ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీబీఎస్‌ఈ తెలిపింది.

హిందీ, సంస్కృతం, మరాఠీ, ఉర్దూ పాఠ్యపుస్తకాలు ఇప్పటికే సిద్ధమయ్యాయని, మిగిలిన షెడ్యూల్డ్ భాషల పుస్తకాలు ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి వస్తాయని ఎన్‌సీఈఆర్‌టీ వివరించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, కొత్త పిటిషన్ల కాపీలు అందిన తర్వాత అన్ని అంశాలను క్రోడీకరిస్తూ పూర్తిస్థాయి సమాధానాన్ని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe