...
...
Next Story

Vijay assets : టీవీకే అధినేత విజయ్​ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

తమిళగ వెట్రి కళగం అధినేత, నటుడు విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 404.58 కోట్ల చరాస్తులు, రూ. 220.15 కోట్ల స్థిరాస్తులను ప్రకటించారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన ఆయన, తన భార్య సంగీతతో విడాకుల వార్తల నడుమ ఆమె పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు.

Published on: Mar 31, 2026 02:00 PM IST
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ నటుడు విజయ్.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అధికారికంగా దిగారు. సోమవారం వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పెరంబూర్ నియోజకవర్గం తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత తన ఆస్తులు, కుటుంబం, వృత్తిపరమైన వివరాలను పొందుపరిచారు.

విజయ్ ఆస్తుల వివరాలు..

తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్.. (PTI)
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్.. (PTI)

అఫిడవిట్ ప్రకారం విజయ్, ఆయన భార్య ఆస్తుల విలువ ఇలా ఉంది:

విజయ్ చరాస్తులు: రూ. 404.58 కోట్లు (ఇందులో 883 గ్రాముల బంగారం, 5 కార్లు, ఒక టూ-వీలర్ ఉన్నాయి).

విజయ్ స్థిరాస్తులు: రూ. 220.15 కోట్లు.

భార్య సంగీత ఆస్తులు: రూ. 15.51 కోట్ల చరాస్తులు (3,132 గ్రాముల బంగారం, 134.91 క్యారెట్ల వజ్రాలు), రూ. 2.5 కోట్ల స్థిరాస్తులు.

నగదు: విజయ్ వద్ద రూ. 2 లక్షలు, సంగీత వద్ద రూ. 1 లక్ష నగదు ఉంది.

విజయ్ తన కుటుంబ సభ్యులకు, ఇతరులకు ఇచ్చిన రుణాల వివరాలను కూడా వెల్లడించారు:

తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌కు రూ. 3.02 కోట్లు.

తల్లి శోభకు రూ. 87.12 లక్షలు.

భార్య సంగీతకు రూ. 12.6 కోట్లు.

కుమారుడు జేసన్ సంజయ్‌కు రూ. 8.78 లక్షలు, కుమార్తె దివ్య సాషాకు రూ. 4.6 లక్షలు.

విజయ్​ వ్యక్తిగత జీవితం, విడాకుల పిటిషన్..

విజయ్ భార్య సంగీత (48) చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు నివేదికలు ధృవీకరిస్తున్నాయి. 2021 నుంచి తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని, విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల మానసిక వేదనకు గురయ్యానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీరి వివాహం 1998లో బ్రిటన్‌లో రిజిస్టర్ అవ్వగా, 1999లో చెన్నైలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది.

విజయ్​ రాజకీయ ప్రస్థానం, ఎన్నికలు..

ఫిబ్రవరి 2024లో రాజకీయ రంగప్రవేశం చేసిన విజయ్, రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.

తన పార్టీ తరపున 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో తన మాజీ డ్రైవర్ కుమారుడు శబరినాథన్​కు కూడా సీటు ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయగన్’ సెన్సార్ బోర్డు చిక్కుల్లో పడటంతో విడుదల ఆలస్యమవుతోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe