...
...
Next Story

ఫోక్స్‌వ్యాగన్ షాక్: 4 ఫ్యాక్టరీల మూసివేత, లక్ష ఉద్యోగాల కోత

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ జర్మనీలో నాలుగు ఫ్యాక్టరీలను మూసివేసి, ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. చైనా కార్ల తయారీ కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీనే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Published on: Jun 26, 2026 06:00 PM IST
Advertisement

ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చైనా ఆటోమొబైల్ కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక జర్మనీలోని నాలుగు ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూసివేయాలని భావిస్తోంది. దీనితో పాటు సంస్థలో పనిచేస్తున్న సుమారు లక్ష మంది ఉద్యోగులపై లేఆఫ్స్ వేటు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఇప్పటికే కంపెనీ పర్యవేక్షక మండలి (Supervisory Board) సభ్యులకు చేరవేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. దీనిపై జూలై 9న జరిగే బోర్డు సమావేశంలో అధికారికంగా చర్చించనున్నారు.

మూతపడనున్న ఫ్యాక్టరీలు ఇవే..

ఫోక్స్‌వ్యాగన్ షాక్: 4 ఫ్యాక్టరీల మూసివేత, లక్ష ఉద్యోగాల కోత (AFP)
ఫోక్స్‌వ్యాగన్ షాక్: 4 ఫ్యాక్టరీల మూసివేత, లక్ష ఉద్యోగాల కోత (AFP)

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జర్మనీలోని హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్ నగరాల్లో ఉన్న ప్లాంట్లతో పాటు, ఆడి (Audi) బ్రాండ్‌కు చెందిన నెక్కర్సల్మ్ ఫ్యాక్టరీని మూసివేయాలని కంపెనీ యాజమాన్యం యోచిస్తోంది. ఈ నాలుగు ఫ్యాక్టరీలను మూసివేయడం వల్ల దాదాపు 45,000 మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది.

గత 2024 చివరి నాటికి కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పటికే 50,000 ఉద్యోగాల కోతకు కంపెనీ సిద్ధమైంది. ఇప్పుడు తాజా ప్రణాళికలు కూడా అమల్లోకి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో మొత్తం తొలగింపుల సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంటుంది.

తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సీఈఓ బ్లూమ్

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సీఈఓ ఒలివర్ బ్లూమ్ ఈ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ఈ వారంలోనే కంపెనీ ఉన్నతాధికారుల ముందు ఉంచారు. అయితే ఈ నిర్ణయానికి కార్మిక సంఘాల నుంచే కాకుండా, కంపెనీలో రెండవ అతిపెద్ద వాటాదారుగా ఉన్న జర్మనీలోని 'లోయర్ సాక్సోనీ' రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఓవరాల్ ప్లాన్ వివరాలను జర్మన్ పత్రిక 'మేనేజర్ మ్యాగజైన్' మొదటిసారిగా బయటపెట్టింది.

ఖర్చులు తగ్గించుకునేందుకేనా?

రాబోయే ఐదేళ్లలో తమ పెట్టుబడి వ్యయాన్ని 15 శాతం మేర తగ్గించుకోవాలని ఫోక్స్‌వ్యాగన్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు 130 బిలియన్ యూరోల (148 బిలియన్ డాలర్లు) లోపే పెట్టుబడులను పరిమితం చేయనున్నారు. 89 ఏళ్ల చరిత్ర గల ఈ ఆటోమొబైల్ దిగ్గజాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఈఓ బ్లూమ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్నో ఆంట్లరిట్జ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఫోక్స్‌వ్యాగన్ ప్రధాన ప్యాసింజర్ కార్ల విభాగాన్ని, స్పేర్ పార్ట్స్ తయారీ విభాగాన్ని వేర్వేరు స్వతంత్ర సంస్థలుగా విభజించే అవకాశం ఉంది.

ఉద్యోగుల పోరాటం

"యాజమాన్యం ముందడుగు వేస్తే ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం" అని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

ఆర్థిక సంవత్సరం 2025 లెక్కల ప్రకారం ఫోక్స్‌వ్యాగన్‌కు ప్రపంచవ్యాప్తంగా 6,67,164 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 43 శాతం మంది జర్మనీలోనే పని చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రేడింగ్‌లో ఫోక్స్‌వ్యాగన్ షేర్లు 16 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్లలో ఉన్న ఆందోళనను తెలియజేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe