గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారులు ఏసీబీకి చిక్కాడు.
రూ. 1.90 లక్షల లంచం డిమాండ్..

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం…. యాదగిరిగుట్టలో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆహార యంత్రాల ఏర్పాటుకు సంబంధించిన రూ.11,50,445 బిల్లును ప్రాసెస్ చేయడానికి దరఖాస్తు వచ్చింది. ఈ మొత్తాన్ని ప్రాసెస్ చేయడానికి అసిస్టెంట్ ఇంజినీర్, ఇంచార్జ్ సూపరింటిండింగ్ ఇంజినీరుగా ఉన్న వూడెపు వెంకట రామారావు. రూ. రూ.1,90,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి… ఏసీబీని ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందటంతో పక్కాగా రంగంలోకి దిగారు. ఫిర్యాదుదారుడి నుంచి వెంకట రామారావు రూ.1,90,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు కాగా దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.