...
...
Next Story

Jeevan Reddy : గులాబీ గూటికి జీవన్ రెడ్డి..! పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్

జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని కేటీఆర్ కలిశారు. బీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు.

Published on: Apr 9, 2026, 17:15:22 IST
Advertisement

ఉమ్మడి కరీంనగర్ రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరొందిన జీవన్ రెడ్డి… గులాబీ గూటికి చేరటం దాదాపుగా ఖరారైపోయింది. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…. కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లారు. పార్టీలోని చేరాలని ఆహ్వానించారు.

జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడని చెప్పారు. జీవన్ రెడ్డి అంటే కేసీఆర్ కు చాలా గౌరవమని చెప్పారు. రైతుల సమస్యల గురించి గట్టిగా మాట్లాడే నాయకుడిగా జీవన్ రెడ్డికి పేరుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి చాలా ఏళ్లుగా పోరాటం చేశారని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ అవుతున్నారని.. అధికారికంగా త్వరలోనే పార్టీలో చేరుతారని ఆశిస్తున్నామని తెలిపారు. ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ నేతల భేటీ తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించటాన్ని స్వాగతించారు. చాలా సమస్యలను పరిష్కరించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని… బీఆర్ఎస్ పార్టీలో పని చేసే అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనూ ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరటం ఖాయమని స్పష్టం చేశారు.

ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనాామా..

నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన జీవన్ రెడ్డి… ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం పని చేసిన తనలాంటి నాయకుడిని తొక్కేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు కూడా చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి పెద్దపీఠ వేసి… నిజమైన కాంగ్రెస్ నాయకులను పక్కనపెట్టడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి రాజీనామా లేఖను పంపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks