ఉమ్మడి కరీంనగర్ రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరొందిన జీవన్ రెడ్డి… గులాబీ గూటికి చేరటం దాదాపుగా ఖరారైపోయింది. ఇందులో భాగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…. కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లారు. పార్టీలోని చేరాలని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… జిల్లా రాజకీయాల్లో జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడని చెప్పారు. జీవన్ రెడ్డి అంటే కేసీఆర్ కు చాలా గౌరవమని చెప్పారు. రైతుల సమస్యల గురించి గట్టిగా మాట్లాడే నాయకుడిగా జీవన్ రెడ్డికి పేరుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి చాలా ఏళ్లుగా పోరాటం చేశారని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ అవుతున్నారని.. అధికారికంగా త్వరలోనే పార్టీలో చేరుతారని ఆశిస్తున్నామని తెలిపారు. ఆయనకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ నేతల భేటీ తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించటాన్ని స్వాగతించారు. చాలా సమస్యలను పరిష్కరించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ ను కలుస్తానని… బీఆర్ఎస్ పార్టీలో పని చేసే అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనూ ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరటం ఖాయమని స్పష్టం చేశారు.
ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనాామా..
నాలుగు దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన జీవన్ రెడ్డి… ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం పని చేసిన తనలాంటి నాయకుడిని తొక్కేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు కూడా చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి పెద్దపీఠ వేసి… నిజమైన కాంగ్రెస్ నాయకులను పక్కనపెట్టడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి రాజీనామా లేఖను పంపారు.