...
...
Next Story

ఎస్సీ, ఓబీసీ స్కాలర్‌షిప్‌లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆ సర్టిఫికెట్ అవసరం లేదు

ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ పెద్ద ఊరటనిచ్చింది. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు నివాస ధృవీకరణ పత్రం (డొమిసిల్ సర్టిఫికెట్) తప్పనిసరి అనే నిబంధనను తొలగించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.2 కోట్ల మంది విద్యార్థులకు ఊరట లభించనుంది.

Published on: Jun 25, 2026 08:18 AM IST
Advertisement

ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు స్థానికత లేదా నివాస ధృవీకరణ పత్రం (డొమిసిల్ సర్టిఫికెట్) సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ సంస్కరణ ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

విద్యార్థుల ఇబ్బందులకు చెక్

ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు నివాస ధృవీకరణ పత్రం (డొమిసిల్ సర్టిఫికెట్) తప్పనిసరి అనే నిబంధనను కేంద్రం తొలగించింది.
ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు నివాస ధృవీకరణ పత్రం (డొమిసిల్ సర్టిఫికెట్) తప్పనిసరి అనే నిబంధనను కేంద్రం తొలగించింది.

ఇప్పటివరకు రెండు పథకాల కింద దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే డొమిసియల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండేది. అయితే, ఇతర రాష్ట్రాల్లో లేదా సొంత జిల్లా దాటి చదువుకునే విద్యార్థులు విద్యా సంవత్సరం మధ్యలో ఈ పత్రాన్ని పొందడానికి అనేక ఇబ్బందులు పడేవారు. సర్టిఫికెట్ కోసం సొంత ఊర్లకు ప్రయాణం చేయాల్సి రావడం, తలిదండ్రులు తమ రోజువారీ కూలీని నష్టపోవడం, కొన్నిసార్లు దళారులను ఆశ్రయించి డబ్బులు వృథా చేసుకోవడం వంటి సమస్యలు ఎదుర్కొనేవారు.

మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తం 4.13 కోట్ల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 58 లక్షల మంది ఎస్సీ విద్యార్థులు (14.2 శాతం), 1.47 కోట్ల మంది ఓబీసీ విద్యార్థులు (35.8 శాతం) ఉన్నారు. నేషనల్ శాంపిల్ సర్వే (NSS), జనాభా లెక్కల వలసల డేటా ప్రకారం.. ఉన్నత చదువులు చదివే విద్యార్థుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది తమ సొంత జిల్లాలను విడిచి ఇతర ప్రాంతాలలో చదువుకుంటున్నారు.

"పత్రాల సమర్పణ భారాన్ని తగ్గించడం, దరఖాస్తు ఖర్చులను ఆదా చేయడం, అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రయోజనాలు సులభంగా అందేలా చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం" అని మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు.

స్కాలర్‌షిప్ పథకాల వివరాలు

ఓబీసీ విద్యార్థులకు సంబంధించి ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ పథకాలకు వార్షిక ఆదాయ పరిమితులు వరుసగా 2.5 లక్షలు, 1 లక్షగా ఉన్నాయి. ఇవి సీనియర్ సెకండరీ, ఐటీఐ కోర్సుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ డిగ్రీల వరకు వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ పథకాల కింద కేవలం ఎస్సీ లబ్ధిదారులకే 7,981 కోట్లకు పైగా నిధులను నేరుగా బదిలీ చేశారు. దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ఎడ్యుకేషన్ స్కీమ్స్‌లో ఇవి ఒకటిగా నిలిచాయి.

అందుబాటులోకి 'సేతు' (SETU) డిజిటల్ ప్లాట్‌ఫారమ్

పత్రాల సరళీకరణతో పాటు, స్కాలర్‌షిప్‌కు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు సామాజిక న్యాయ శాఖ ఉమాంగ్ (UMANG) యాప్‌లో 'సేతు' (SETU - Scholarship for Educational Transformation and Upliftment) అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఇది విద్యార్థులు, ఇన్‌స్టిట్యూషనల్ నోడల్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్లు, రాష్ట్ర అధికారులందరికీ ఒకే వేదికగా ఉపయోగపడుతుంది. గతంలో వేర్వేరు ఛానళ్ల ద్వారా జరిగే దరఖాస్తు నమోదు, స్టేటస్ ట్రాకింగ్, వెరిఫికేషన్ ప్రక్రియలను ఇప్పుడు దీని ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు.

ఈ మార్పులపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖలు పాఠశాలలను ఆదేశిస్తున్నాయి. పంజాబ్ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే తమ జిల్లా విద్యాధికారులకు దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

"సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం, సంక్లిష్టమైన నిబంధనలను తొలగించడం, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా, పారదర్శకంగా అందించాలనే ప్రభుత్వ విస్తృత లక్ష్యానికి అనుగుణంగానే ఈ చర్యలు చేపట్టాం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe