రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్ సెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.
ఈనెల 23 నుంచి దరఖాస్తులు…

ఫిబ్రవరి 23వ తేదీ నుంచి తెలంగాణ ఎడ్సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద సాధారణ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఇక ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులకు రూ.550 గా నిర్ణయించారు.
టీజీ ఎడ్సెట్ ఎగ్జామ్ రాయాలంటే… డిగ్రీ పూర్తి అయిన అభ్యర్థులు అర్హులవుతారు. వారి విద్యా అర్హతల ఆధారంగా సంబంధిత సబ్జెక్టును ఎంచుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. 2 గంటల సమయం ఉంటుంది. https://edcet.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్, సిలబస్, పరీక్షా విధానం వంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకోవచ్చు.
టీజీ ఎడ్ సెట్ - 2026 పరీక్షను మే 12వ తేదీన నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పూర్తి చేస్తారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.
ఈసారి కూడా ఎడ్సెట్ ప్రవేశ పరీక్షను కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహణ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి… సీట్లను భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్ ఫేజ్ లు పూర్తి అయి సీట్లు మిగిలితే… స్పాట్ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంటారు.