...
...
Next Story

బస్సు కండక్టర్​ నుంచి రైతు వరకు.. 45మంది 'అన్​-సంగ్​ హీరోస్​'కి పద్మ పురస్కారం

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. సమాజం కోసం నిశ్శబ్దంగా శ్రమిస్తూ, ఎన్నో కష్టాలను అధిగమించి అద్భుతాలు సృష్టించిన 45 మంది 'అన్-సంగ్ హీరోల'కు ఈ ఏడాది పద్మశ్రీ వరించింది.

Published on: Jan 26, 2026, 08:15:51 IST
Advertisement

వ్యక్తిగత కష్టాలను, విషాదాలను అధిగమించి, తమ రంగాల్లో రాణించడమే కాకుండా సమాజ సేవ కోసం జీవితాన్ని అంకితం చేసిన 45 మందికి 'అన్​-సంగ్​ హీరోస్​' కేటగిరీలో 2026 పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వీరి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో వీరి గురించి, సమాజానికి వీరు అందిస్తున్న సేవల గురించి ఇక్కడ తెలుసుకుందాము..

2026 పద్మశ్రీ అవార్డులు: ది అన్​-సంగ్​ హీరోస్​..

45మంది 'అన్​-సంగ్​ హీరోస్​'కి పద్మ పురస్కారం.. (PTI)
45మంది 'అన్​-సంగ్​ హీరోస్​'కి పద్మ పురస్కారం.. (PTI)

ఆసియాలోనే మొట్టమొదటి హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌ను స్థాపించి రికార్డు సృష్టించిన ముంబైకి చెందిన పీడియాట్రీషియన్ అర్మిడా ఫెర్నాండెజ్ 2026 పద్మశ్రీ అవార్డుల జాబితాలో ఉన్నారు. బ్లాక్​ ఫీవర్​ గుర్తింపు కోసం అత్యంత చౌకైన పరీక్షను అభివృద్ధి చేసిన శ్యామ్ సుందర్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తుల కోసం విశేష కృషి చేసిన హెమటాలజిస్ట్ సురేష్ హంగావడి సైతం ఈ లిస్ట్​లో ఉన్నారు.

లడఖ్‌కు చెందిన పద్మ గుర్మెత్ పురాతన టిబెటన్ వైద్య విధానాన్ని ప్రచారం చేస్తుండగా, తమిళనాడుకు చెందిన వెటర్నరీ సైంటిస్ట్ పున్నియమూర్తి నటేషన్ సంప్రదాయ మందులను ఆధునిక విజ్ఞానంతో కలిపి జంతువులకు చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జెనెటిక్ సైంటిస్ట్ కుమారస్వామి తంగరాజ్, అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్న గుజరాత్ 'డొనేట్ లైఫ్' వ్యవస్థాపకుడు నీలేష్ వినోద్ చంద్ర మాండ్లేవాలా కూడా ఈ గౌరవానికి ఎంపికయ్యారు.

పద్మశ్రీ అవార్డులు- అక్షర యోధులు.. కళాకారులు

కర్ణాటకకు చెందిన మాజీ బస్సు కండక్టర్ అంకె గౌడ అద్భుతం చేశారు. ఆయన 20 భాషల్లో 20 లక్షలకు పైగా పుస్తకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద 'ఉచిత లైబ్రరీ'ని ఏర్పాటు చేశారు. కళల విభాగంలో, మధ్యప్రదేశ్ నుంచి బుందేలీ యుద్ధ కళా శిక్షకుడు భగవాన్‌దాస్ రైక్వార్, పుదుచ్చేరికి చెందిన సిలంబం కళాకారుడు కె. పజనివేల్, మహారాష్ట్రకు చెందిన 90 ఏళ్ల గిరిజన తార్పా వాయిద్యకారుడు భిక్ల్యా లడక్యా ధిండా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

గుజరాత్ సంప్రదాయ కళ 'మాన్ భట్'లో నిష్ణాతులైన ధార్మిక్ లాల్ చునీలాల్ పాండ్యా, అంతరిస్తున్న 'అల్గోజా' వాయిద్యాన్ని కాపాడుతున్న తగా రామ్ భీల్, ఒడిశాకు చెందిన సఖి నాట కళాకారుడు సీమాంచల్ పాత్రో, నాగాలాండ్ ఫోక్ థియేటర్ గురువు సాంగ్యుసాంగ్ ఎస్ పోంజెనర్, అసోం దృశ్య రూపశిల్పి నురుద్దీన్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు.

తమిళనాడు నుంచి భజన గాయకుడు ఓతువార్ తిరుత్తణి స్వామినాథన్, కురుంబ గిరిజన కళను పునరుద్ధరిస్తున్న ఆర్. కృష్ణన్, తిరువారూర్ భక్తవత్సలం పద్మశ్రీకి ఎంపికయ్యారు.

సామాజిక సేవ, అభివృద్ధి..

ఛత్తీస్‌గఢ్‌ నక్సల్ ప్రాంతాల్లో బడులు కట్టిన బుద్రి థాటి, బస్తర్ గిరిజనులకు తక్కువ ధరకే వైద్యం అందిస్తున్న రామచంద్ర, సునీతా గాడ్బోలే, జమ్ముకశ్మీర్ సామాజిక కార్యకర్త బ్రిజ్ లాల్ భట్, మాజీ ఐపీఎస్ అధికారి ఇందర్జిత్ సింగ్ సిద్ధూ, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన తెచ్చి గుబిన్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.

తెలంగాణ నుంచి సహకార రంగంలో పశుసంవర్ధక విప్లవం తెచ్చిన రామరెడ్డి మామిడి, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న కర్ణాటకకు చెందిన ఎస్​జీ సుశీలమ్మ కూడా పురస్కార గ్రహీతల్లో ఉన్నారు.

అసోంకు చెందిన పోకిలా లెఖ్తేపి (జానపద సంగీతం), మీర్ హాజీభాయ్ కాసంభాయ్ (ధోలక్), ఒడిశాకు చెందిన సంతాలీ రచయిత చరణ్ హెంబ్రమ్, హిందీ భాషా వ్యాప్తికి కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కైలాష్ చంద్ర పంత్, కాశ్మీరీ సాహితీవేత్త షఫీ షౌక్, త్రిపుర కోక్ బోరోక్ భాషా పరిరక్షకుడు నరేష్ చంద్ర దేబ్బర్మ ఈ 2026 పద్మశ్రీ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

పర్యావరణం, వ్యవసాయం..

పర్యావరణం కోసం 40 ఏళ్లుగా శ్రమిస్తున్న కేరళకు చెందిన 92 ఏళ్ల కొల్లాక్కయిల్ దేవకి అమ్మ, మేఘాలయకు చెందిన హల్లీ వార్, మధ్యప్రదేశ్‌లో 75 వేల నీటి నిర్మాణాలను నిర్మించిన మోహన్ నగర్ ఈ అపురూప గౌరవాన్ని పొందారు. వ్యవసాయ రంగంలో 'దాదా లాడ్' పత్తి సాగు విధానాన్ని కనిపెట్టిన మహారాష్ట్ర రైతు శ్రీరంగ్ దేవబా లాడ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో రైతు రఘుపత్ సింగ్, ఒడిశాకు చెందిన మహేంద్ర కుమార్ మిశ్రా (గిరిజన భాషల పరిరక్షణ) ఈ జాబితాలో ఉన్నారు.

వీరితో పాటు.. ఉత్తరప్రదేశ్ నుంచి బ్రాస్ ఎన్‌గ్రేవింగ్ నిపుణుడు చిరంజీ లాల్ యాదవ్, తమిళనాడు బ్రాంజ్ స్కల్ప్​టర్​ రాజస్థాపతి కాళీయప్ప గౌండర్, పశ్చిమ బెంగాల్ కాంత ఎంబ్రాయిడరీ శిక్షకురాలు తృప్తి ముఖర్జీ, హరియాణాకు చెందిన జమ్దానీ వీవింగ్ నిపుణుడు ఖేమ్ రాజ్ సుంద్రియాల్, మహారాష్ట్ర 'తమాషా' కళాకారుడు రఘువీర్ తుకారాం ఖేడ్కర్ తమ కృషికి తగిన ఫలితాన్ని అందుకున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe