...
...
Next Story

8th Pay Commission : జీతాలు, పెన్షన్ల పెంపు ఎంత? 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్డేట్స్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ పే కమిషన్ కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వేతన పెరుగుదల అంచనాలు, అమలు తేదీపై తాజా సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Published on: Apr 12, 2026 06:03 AM IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం పనులు ఊపందుకున్నాయి. గతేడాది నవంబర్‌లో ఈ కమిషన్‌కు సంబంధించిన 'టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్' జారీ చేసినప్పటి నుంచి.. జీతాల పెంపు, బకాయిలు, పెన్షన్ నిర్మాణంలో మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కమిషన్ తన తుది నివేదికను సమర్పించడానికి ప్రభుత్వం 18 నెలల గడువు ఇచ్చింది.

8వ వేతన సంఘం అప్డేట్స్..
8వ వేతన సంఘం అప్డేట్స్..

ఈ నేపథ్యంలో అసలు 8వ పే కమిషన్ అంటే ఏంటి? జీతం ఎంత పెరగవచ్చు? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

8వ పే కమిషన్ అంటే ఏంటి?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లను సవరించడానికి ప్రతి పదేళ్లకోసారి ప్రభుత్వం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇదే పే కమిషన్. ఇది కేవలం జీతాలు పెంచడమే కాకుండా.. పదవీ విరమణ ప్రయోజనాలు, భత్యాలు, ప్రభుత్వ వ్యయంపై వాటి ప్రభావాన్ని కూడా విశ్లేషిస్తుంది.

ఈ 8వ వేతన సంఘానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు ప్రొఫెసర్ పులక్ ఘోష్ సభ్యుడిగా, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

8వ పే కమిషన్ పనితీరు, తాజా షెడ్యూల్..

కమిషన్ ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖలు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. 2026 మార్చి, ఏప్రిల్ నెలల్లో అధికారికంగా మెమోరాండం సమర్పణలను కమిషన్ స్వీకరించింది. దీనిలో భాగంగా స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలోనే 2026 ఏప్రిల్ 24న డెహ్రాడూన్‌లో ఒక కీలక సమావేశాన్ని కూడా షెడ్యూల్ చేసింది.

8వ పే కమిషన్- ఎంత జీతం పెరగవచ్చు? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకం

అయితే, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 3.0 నుంచి 3.25 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కేటాయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రామాణికంగా తీసుకుంటే, వివిధ స్థాయిల్లో జీతాల పెరుగుదల ఇలా ఉండవచ్చు:

లెవల్ 1 (ఎంట్రీ లెవల్): రూ. 46,260

లెవల్ 10 (గ్రూప్ బి): రూ. 1,44,177

లెవల్ 18 (టాప్ లెవల్): రూ. 6,42,500

భారీగా బకాయిలు అందుకునే ఛాన్స్..

ఈ 8వ వేతన సంఘం అమలు ఆలస్యమైనప్పుడల్లా అభ్యర్థులకు పాత తేదీ నుంచి బకాయిలు చెల్లిస్తారు. గతంలో 6వ పే కమిషన్ సమయంలో గరిష్టంగా 32 నెలల బకాయిలను (సుమారు రూ. 71,000) చెల్లించారు. 8వ పే కమిషన్ అమలులో కూడా జాప్యం జరిగితే, ఉద్యోగులకు భారీ మొత్తంలో అరియర్స్ వచ్చే అవకాశం ఉంది.

8వ పే కమిషన్- అమలు ఎప్పటి నుంచి?

8వ పే కమిషన్ 2025 జనవరి 17న నోటిఫై అయ్యింది. నిబంధనల ప్రకారం ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, గత కమిషన్ల చరిత్రను చూస్తే (7వ కమిషన్‌కు 2.5 ఏళ్లు పట్టింది).. 8వ వేతన సంఘం పూర్తిస్థాయి అమలుకు మరికొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ, ఆర్థిక ప్రయోజనాలు మాత్రం 2026 జనవరి నుంచే వర్తించే అవకాశం ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. 8వ పే కమిషన్ వల్ల ఎంతమందికి ప్రయోజనం కలుగుతుంది?

సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (రక్షణ రంగంతో కలిపి), 65 లక్షల మంది పెన్షనర్లకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది.

2. కనీస బేసిక్ పే ఎంత వరకు పెరగవచ్చు?

ప్రస్తుతం ఉన్న రూ. 18,000 కనీస బేసిక్ పే, 8వ పే కమిషన్ సిఫార్సుల ప్రకారం సుమారు రూ. 51,480 కి పెరిగే అవకాశం ఉందని అంచనా.

3. 8వ పే కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ఏమిటి?

అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం https://8cpc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

4. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి?

ఇది పాత జీతాన్ని కొత్త జీతంగా మార్చే ఒక లెక్క. ఉదాహరణకు మీ పాత బేసిక్ పేను కమిషన్ నిర్ణయించిన ఫ్యాక్టర్ (ఉదా: 2.57) తో గుణిస్తే వచ్చేదే మీ కొత్త జీతం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe