...
...
Next Story

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026.. టైమ్ వేస్ట్ ఆటలకు ఇక చెక్.. ఫుట్‌బాల్‌లో రాబోతున్న సరికొత్త రూల్స్ ఇవే!

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026 నేపథ్యంలో ఫుట్‌బాల్ ఆటలో సమయాన్ని వృథా చేసే ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసేందుకు ఫిఫా, ఐఎఫ్ఏబీ సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టాయి. గోల్‌కీపర్ రూల్, వీఏఆర్ తో పాటు పలు విప్లవాత్మక మార్పులు ఇందులో ఉన్నాయి.

Published on: May 27, 2026 01:05 PM IST
Advertisement

FIFA World Cup: అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2026 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి సర్వం సిద్ధమవుతోంది. చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 48 జట్లు తలపడుతున్న ఈ మహా సమరంలో అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) నడుం బిగించింది. ముఖ్యంగా మ్యాచ్‌ ముగిసే సమయంలో కావాలనే సమయాన్ని వృథా చేసే జట్ల వ్యూహాలకు ఈసారి గట్టి బ్రేక్ పడనుంది.

ఫిఫా రూల్స్

ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో కొత్త నిబంధనలు (REUTERS)
ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ లో కొత్త నిబంధనలు (REUTERS)

మైదానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు నెమ్మదిగా నడవడం, గాయాల పేరుతో వ్యూహాత్మకంగా మ్యాచ్‌ను ఆలస్యం చేయడం వంటి చర్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫుట్‌బాల్ నియమ నిబంధనలను రూపొందించే ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డ్ (IFAB)తో కలిసి ఫిఫా కొన్ని కీలక మార్పులను తీసుకొచ్చింది.

గోల్‌కీపర్‌కు 8 సెకన్ల గడువు

గతంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని టోర్నీల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన 8 సెకన్ల గోల్‌కీపర్ నిబంధనను, ఈ ప్రపంచకప్‌లో పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఈ రూల్ ప్రకారం, గోల్‌కీపర్ బంతిని తన చేతుల్లో లేదా పెనాల్టీ బాక్స్‌లో 8 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఉంచుకోకూడదు.

ఒకవేళ ఆ గడువు దాటితే, ప్రత్యర్థి జట్టుకు నేరుగా కార్నర్ కిక్ లభిస్తుంది. ఇందులో రెఫరీ మొదటి 3 సెకన్ల పాటు మనసులోనే సమయాన్ని లెక్కిస్తారు. ఆ తర్వాత మిగిలిన 5 సెకన్ల సమయాన్ని తన చేతి సంజ్ఞల ద్వారా కౌంట్‌డౌన్ రూపంలో స్పష్టంగా చూపిస్తారు.

వీఏఆర్ (VAR) నిబంధనల్లో మార్పులు

గతంలో వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) కేవలం నేరుగా రెడ్ కార్డ్ ఇచ్చే సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు. ఇకపై ఒకే మ్యాచ్‌లో రెండో ఎల్లో కార్డు ఇచ్చే వివాదాస్పద నిర్ణయాలను కూడా వీఏఆర్ సమీక్షించవచ్చు.

కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ జరుగుతున్నప్పుడు మైదానంలో గాయపడి చికిత్స పొందే ఆటగాళ్లు, ఆట తిరిగి ప్రారంభం కాగానే కచ్చితంగా మైదానం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కనీసం ఒక నిమిషం పాటు వేచి చూసిన తర్వాతే మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలి. గతంలో ఆటగాళ్ల రక్షణ కోసం రెఫరీ విజిల్ వేసి మ్యాచ్‌ను నిలిపివేసేవారు.

మెడికల్ టీమ్ లోపలికి వచ్చి చికిత్స పూర్తి చేశాక మ్యాచ్ ప్రారంభమయ్యేది. దీనివల్ల ఆట వేగం దెబ్బతినడమే కాకుండా, ఆధిక్యంలో ఉన్న జట్టు మేనేజర్‌కు తన ఆటగాళ్లతో మాట్లాడేందుకు అదనపు సమయం దొరికేది. ఇకపై ఈ వ్యూహాలు సాగవు.

సబ్‌స్టిట్యూషన్ టైమింగ్స్

మ్యాచ్ మధ్యలో బయటకు వెళ్లే ఆటగాడు (సబ్‌స్టిట్యూట్ అయ్యే ప్లేయర్) తనకు సిగ్నల్ అందిన 10 సెకన్ల లోపే మైదానాన్ని వీడాలి. ఒకవేళ ఆ సమయంలోగా బయటకు రాకపోతే, అతని స్థానంలో లోపలికి వచ్చే కొత్త ఆటగాడు ఒక నిమిషం పాటు మైదానం బయటే ఆగాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ జట్టు మైదానంలో తాత్కాలికంగా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వస్తుంది, ఇది ఆ జట్టుకు పెద్ద మైనస్ అవుతుంది

త్రో-ఇన్, గోల్ కిక్ కౌంట్‌డౌన్

మ్యాచ్‌ను ఆలస్యం చేసే ఉద్దేశంతో త్రో-ఇన్ లేదా గోల్ కిక్ వేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, రెఫరీ 5 సెకన్ల కౌంట్‌డౌన్‌ను చూపిస్తారు. ఈ కౌంట్‌డౌన్ ముగిసేలోగా ఆటను ప్రారంభించకపోతే బంతిపై కంట్రోల్ ను ప్రత్యర్థి జట్టుకు ఇస్తాడు. త్రో-ఇన్ ఆలస్యమైతే ప్రత్యర్థికి త్రో-ఇన్ ఇస్తారు. ఒకవేళ గోల్ కిక్ ఆలస్యమైతే ప్రత్యర్థి జట్టుకు కార్నర్ కిక్ లభిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: 2026 ఫిఫా ప్రపంచకప్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన గోల్‌కీపర్ రూల్ ఏమిటి?

జవాబు: గోల్‌కీపర్ బంతిని పెనాల్టీ బాక్స్‌లో 8 సెకన్ల కంటే ఎక్కువ సమయం ఉంచుకుంటే ప్రత్యర్థి జట్టుకు కార్నర్ కిక్ ఇస్తారు. రెఫరీ చివరి 5 సెకన్లను చేతి సంజ్ఞలతో కౌంట్‌ చేస్తారు.

ప్రశ్న: వీఏఆర్ (VAR) నిబంధనలలో ఎలాంటి మార్పులు చేశారు?

జవాబు: ఇకపై రెండో ఎల్లో కార్డు ఇవ్వడం, అలాగే పొరపాటున వేరే ఆటగాడికి కార్డు ఇవ్వడం (మిస్టేకన్ ఐడెంటిటీ) వంటి విషయాలను కూడా వీఏఆర్ సమీక్షించవచ్చు.

ప్రశ్న: సబ్‌స్టిట్యూట్ ఆటగాడు 10 సెకన్లలోపు మైదానాన్ని వీడకపోతే ఏమవుతుంది?

జవాబు: కొత్త ఆటగాడు లోపలికి రావడానికి కనీసం ఒక నిమిషం పాటు బయటే ఆగాలి. అప్పటివరకు ఆ జట్టు 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe