...
...
Next Story

ఐఐటీ మద్రాస్ బంపర్ ఆఫర్- డేటా సైన్స్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు…

ఐఐటీ మద్రాస్ సరికొత్త బీఎస్సీ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ డేటా సైన్స్ కోర్సును ప్రారంభించింది. ఇంటర్ పాసైన విద్యార్థులతో పాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇందులో చేరవచ్చు. మే 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఐఐటీ మద్రాస్ సూచించింది.

Published on: Feb 23, 2026 05:32 AM IST
Advertisement

ప్రముఖ విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ సరికొత్త విద్యా కోర్సుతో ముందుకు వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మేనేజ్‌మెంట్ నైపుణ్యాలతో పాటు అనలిటికల్ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో 'బీఎస్సీ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ డేటా సైన్స్' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. నేటి డేటా యుగంలో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో డేటా సైన్స్ పాత్ర కీలకంగా మారిన నేపథ్యంలో ఈ కోర్సును డిజైన్ చేశారు.

ఎవరు అర్హులు?

ఐఐటీ మద్రాస్
ఐఐటీ మద్రాస్

ఐఐటీ మద్రాస్​ కొత్త కోర్సులో చేరడానికి వయోపరిమితి ఏమీ లేదు. అలాగే సీట్ల సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితి విధించలేదు. ముఖ్యంగా 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం 11వ తరగతి ఫైనల్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఇప్పుడే అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, వారు ఇంటర్ పూర్తి చేసిన తర్వాతే కోర్సులో ఎన్‌రోల్ అవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ పాఠశాల స్థాయిలో గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులుగా చదివి ఉండటం మాత్రం తప్పనిసరి.

ఉద్యోగులకు వరం.. హైబ్రిడ్ మోడ్!

కేవలం విద్యార్థులే కాకుండా, ఇప్పటికే వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ కోర్సు ఎంతో ఉపయోగపడనుంది. ఇది 'హైబ్రిడ్ మోడ్'లో అందుబాటులో ఉంటుంది. అంటే రికార్డెడ్ లెెక్చర్స్, లైవ్ సెషన్లు ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలకు ఆటంకం కలగకుండా కేవలం ఆదివారాల్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల పని చేసుకుంటూనే ఐఐటీ డిగ్రీని పొందే అవకాశం కలుగుతుంది.

కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి?

డేటా సైన్స్, మేనేజ్‌మెంట్ కలయికతో రూపొందించిన ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కన్సల్టింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, పబ్లిక్ పాలసీ వంటి రంగాల్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐఐటీ మద్రాస్ వెల్లడించింది.

మొదటి బ్యాచ్ జూన్ 2026 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 31, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఐఐటీ మద్రాస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు.

ఏరోనాటిక్స్​లో కూడా..!

ఇటీవలి కాలంలో ఐఐటీ మద్రాస్​ వరుస డిగ్రీలను లాంచ్​ చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఏరోనాటిక్స్, స్పేస్ టెక్నాలజీలో ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ బీఎస్ (బ్యాచిలర్​ ఆఫ్​ సైన్స్​) ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. నేటి యువతకు విమానయానం, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కోర్సు ఒక చక్కని వేదిక కానుంది.

పన్నెండో తరగతి (ఇంటర్మీడియట్) లేదా దానికి సమానమైన విద్యను పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe