...
...
Next Story

ఆమ్లెట్ ముక్క హంతకుడిని పట్టించింది: క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే మర్డర్ మిస్టరీ

గ్వాలియర్ అడవుల్లో ముఖం ఛిద్రమైన స్థితిలో దొరికిన ఒక మహిళ మృతదేహం.. కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి. కానీ, పోలీసులకు దొరికిన చిన్న ఆధారం.. చివరకు హంతకుడిని కటకటాల వెనక్కి నెట్టేలా చేసింది. ఆ ఆసక్తికరమైన కథనం మీకోసం..

Published on: Jan 06, 2026 11:50 AM IST
Advertisement

అదొక నిర్మానుష్యమైన అటవీ ప్రాంతం. అక్కడ ఒక మహిళ మృతదేహం పడి ఉంది. ఆమె తలను పెద్ద బండరాయితో మోది కిరాతకంగా చంపేశారు. ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. పోలీసుల ముందున్నది ఒక 'బ్లైండ్ కేస్' (Blind Case). కానీ, కేవలం ఒక ఆమ్లెట్ ముక్క ఆ కేసులో ఎలా టర్నింగ్ పాయింట్‌గా మారిందో తెలుసా? మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించిన ఈ హత్యోదంతం ఆసక్తికరంగా ఉంది.

ఆమ్లెట్ ముక్క ఇచ్చిన తొలి క్లూ

ఆమ్లెట్ ముక్క హంతకుడిని పట్టించింది: క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే మర్డర్ మిస్టరీ (PTI/ Representative)
ఆమ్లెట్ ముక్క హంతకుడిని పట్టించింది: క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే మర్డర్ మిస్టరీ (PTI/ Representative)

డిసెంబర్ 29న గ్వాలియర్ శివారులోని గోలా కా మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులకు మృతదేహం పక్కనే ఒక చిన్న ఆమ్లెట్ ముక్క దొరికింది. ఎస్ఎస్పీ ధర్మవీర్ సింగ్ ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. "ముందుగా ఆ ఆమ్లెట్ ఎక్కడిదో ఆరా తీశాం. ఘటనా స్థలానికి సుమారు 200 మీటర్ల పరిధిలోని అన్ని ఫుడ్ స్టాల్స్‌ను తనిఖీ చేశాం. ఒక మహిళ ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమ్లెట్ తిన్నట్లు ఒక బండి యజమాని గుర్తుపట్టాడు" అని ఆయన వివరించారు.

రంగంలోకి AI.. ఊపిరి పోసుకున్న స్కెచ్

మృతురాలు ఎవరో తెలిస్తే తప్ప కేసు ముందుకు సాగదు. కానీ ముఖం పూర్తిగా దెబ్బతినడంతో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. ఇక్కడే పోలీసులు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) సహాయం తీసుకున్నారు. టెక్నాలజీ సాయంతో ఆ మహిళ ముఖం ఎలా ఉండవచ్చో ఊహిస్తూ ఒక స్కెచ్‌ను రూపొందించారు. ఆ ఫోటోను మధ్యప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు పంపగా, ఆమె టీకంగఢ్‌కు చెందిన మహిళగా గుర్తింపు లభించింది.

హంతకుడిని పట్టిచ్చిన UPI పేమెంట్

ఆమ్లెట్ బండి వద్ద ఉన్న సీసీటీవీ విజువల్స్‌ను పోలీసులు నిశితంగా పరిశీలించారు. అందులో ఆ మహిళతో పాటు ఉన్న వ్యక్తులు ఆమ్లెట్ కోసం నగదు ఇవ్వకుండా 'ఆన్‌లైన్ పేమెంట్' (UPI) చేసినట్లు గుర్తించారు. ఆ డిజిటల్ అడుగుజాడలను వెంబడించగా, నిందితుడు గ్వాలియర్‌కు చెందిన సచిన్ సేన్ అని తేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకీ కిరాతకం?

నిందితుడి నుంచి రక్తపు మరకలున్న దుస్తులు, ఇతర సాక్ష్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలు, ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వాడుకోవడంతో ఈ మిస్టరీ వీడింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe