...
...
Next Story

ఢిల్లీ పేలుడు: సూత్రధారి ఉమర్ నబీనేనని ధ్రువీకరించిన పోలీసులు

న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తిమంతమైన కారు పేలుడుకు పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని ఢిల్లీ పోలీసులు గురువారం ధ్రువీకరించారు. పేలుడులో చిధ్రమైన మృతదేహం డీఎన్‌ఏను అతని తల్లి డీఎన్‌ఏతో సరిపోల్చగా ఈ విషయం స్పష్టమైంది. ఉమర్ ఫరీదాబాద్ 'వైట్ కాలర్' టెర్రర్ మాడ్యూల్‌లో కీలక సభ్యుడు.

Published on: Nov 13, 2025, 08:27:56 IST
Advertisement

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన అత్యంత శక్తిమంతమైన పేలుడుకు పాల్పడిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని ఢిల్లీ పోలీసులు గురువారం నాడు అధికారికంగా ధ్రువీకరించారు.

పేలుడుకు ముందు కారులో ఉమర్ కదలికలు (HT_PRINT)
పేలుడుకు ముందు కారులో ఉమర్ కదలికలు (HT_PRINT)

"ఎర్రకోట సమీపంలో పేలుడుకు పాల్పడింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీనే అని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్ధారించాం. పేలుడు తర్వాత అతని కాలు స్టీరింగ్ వీల్, యాక్సిలరేటర్‌ల మధ్య ఇరుక్కుపోయింది. అతని డీఎన్‌ఏ నమూనా తల్లి డీఎన్‌ఏతో సరిపోలింది" అని ఢిల్లీ పోలీసులు ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు.

నవంబర్ 10, 2025 సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతం సమీపంలో నిదానంగా కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగింది. ఈ కారును ఉమర్ నబీనే నడుపుతున్నట్లు భావిస్తున్నారు. ఈ పేలుడులో ఉమర్ మరణించినట్లు సమాచారం.

ఎవరు ఈ ఉమర్ నబీ? ఉగ్రవాద లింక్ ఏమిటి?

ఉమర్ నబీ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉన్న అల్-ఫలా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారని గతంలోనే పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.

స్వస్థలం: ఉమర్ జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, లెత్‌పోరాలోని కోయిల్ గ్రామానికి చెందినవాడు.

ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధం: ఫరీదాబాద్‌లో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఛేదించిన ఉగ్రవాద మాడ్యూల్‌లో ఉమర్ కూడా సభ్యుడిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పేలుడు పదార్థాలు: నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో పేలిన కారులో ఉమర్ పేలుడు పదార్థాలు, బహుశా అమ్మోనియం నైట్రేట్‌ను తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు.

మూడు గంటల పాటు ఎర్రకోట వద్ద వేచి

దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఉమర్ ఎర్రకోట సమీపంలో ఉన్న సున్హరి మసీదు పార్కింగ్ స్థలంలో తన కారులో దాదాపు మూడు గంటల పాటు వేచి ఉన్నాడు. ఆ సమయంలో తన సహచరుల అరెస్టుల గురించి ఇంటర్నెట్‌లో అప్‌డేట్‌లను వెతుకుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ఈ వారం ప్రారంభంలోనే ఛేదించిన "వైట్ కాలర్" టెర్రర్ మాడ్యూల్‌లో ఉమర్ కీలక సభ్యుడు. జమ్మూ కశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్‌లో దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొద్ది గంటలకే ఎర్రకోట వద్ద పేలుడు సంభవించింది.

పోలీసులు నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్‌లతో సంబంధం ఉన్న ఈ ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించి, ముగ్గురు డాక్టర్లతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఈ ఉగ్రవాద మాడ్యూల్‌ను పట్టుకున్న తర్వాత పోలీసులు సుమారు 3,000 కిలోల అమ్మోనియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, సల్ఫర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks