...
...
Next Story

Supreme Court : 11ఏళ్లుగా ట్యూబ్ల ద్వారా ఆహారం- కొడుకు కోసం తల్లిదండ్రుల పోరాటం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court passive euthanasia : పదేళ్లకు పైగా అచేతనంగా ఉన్న 31 ఏళ్ల హరీష్ రాణాకు 'పాసివ్ యుథనేషియా' పొందేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. గౌరవప్రదంగా మరణించే హక్కులో భాగంగా కృత్రిమ ఆహారం, నీటిని నిలిపివేయవచ్చని పేర్కొంటూ భవిష్యత్తు కోసం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

Published on: Mar 11, 2026 12:12 PM IST
Advertisement

భారత న్యాయ చరిత్రలో బుధవారం ఒక అరుదైన, అత్యంత కీలకమైన తీర్పు వెలువడింది! గత 11 ఏళ్లుగా అపస్మారక స్థితిలో (పర్మనెంట్​ వెజిటేటివ్​ స్టేట్​) మంచానికే పరిమితమైన 31 ఏళ్ల వ్యక్తికి 'కారుణ్య మరణం' (పాసివ్​ యుథనేషియా) ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. భవిష్యత్తులో ఇటువంటి కేసులను నియంత్రించేందుకు అవసరమైన రక్షణ చర్యలు, విధానపరమైన మార్గదర్శకాలను కూడా ఈ సందర్భంగా ధర్మాసనం ఖరారు చేసింది.

31ఏళ్ల వ్యక్తికి కారణ్య మరణం- అంగీకరించిన సుప్రీంకోర్టు.. (ANI)
31ఏళ్ల వ్యక్తికి కారణ్య మరణం- అంగీకరించిన సుప్రీంకోర్టు.. (ANI)

జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ.. సదరు రోగి ప్రయోజనాలను, అతడి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని, పాలియేటివ్ కేర్ పర్యవేక్షణలో అతడికి అందుతున్న జీవన రక్షణ సాయాన్ని ఉపసంహరించుకోవడమే సరైన నిర్ణయమని పేర్కొంది.

ఎయిమ్స్ పర్యవేక్షణలో ప్రక్రియ..

హరీష్ రాణా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించిన సుప్రీంకోర్టు.. కఠినమైన వైద్య పర్యవేక్షణలో అతడికి అందుతున్న 'క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్' (సీఏఎన్​హెచ్​ - కృత్రిమ ఆహారం, నీరు) నిలిపివేసేందుకు అంగీకరించింది. ఈ ప్రక్రియను దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్​) పాలియేటివ్ కేర్ యూనిట్‌లో నిర్వహించాలని ఆదేశించింది.

తీర్పులోని ముఖ్యాంశాలను చదివి వినిపిస్తూ ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది:

"కృత్రిమంగా ఆహారం, నీరు అందించడం అనేది సాధారణ సంరక్షణ కిందకు రాదు. ఇది సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యపరమైన జోక్యం. దీనిని నిపుణులైన ఆరోగ్య కార్యకర్తలు పర్యవేక్షిస్తారు. కాబట్టి, రోగి పరిస్థితిని బట్టి అటువంటి వైద్య సాయాన్ని ఉపసంహరించుకోవాలని మెడికల్ బోర్డులు నిర్ణయం తీసుకోవచ్చు."

మరణం గురించి కాదు.. గౌరవం గురించి!

హరీష్ రాణా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతడిని పరీక్షించిన మెడికల్ బోర్డులు ఏకగ్రీవంగా ఒకే నిర్ణయానికి వచ్చాయి. ఈ చికిత్సను కొనసాగించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, దానిని నిలిపివేయడమే అతడికి మేలు చేస్తుందని వారు కోర్టుకు విన్నవించారు. సాధారణంగా మెడికల్ బోర్డు అభిప్రాయం తర్వాత కోర్టు జోక్యం అవసరం లేకపోయినా, ఈ తరహాలో ఇది మొదటి కేసు కావడంతో సమగ్రమైన ఆదేశాలు ఇస్తున్నట్లు బెంచ్ తెలిపింది.

వదిలేయడం కాదు.. విముక్తి కల్పించడం!

జీవన రక్షణ చికిత్సను నిలిపివేయడం అంటే రోగిని వదిలేయడం కాదని కోర్టు నొక్కి చెప్పింది. "ఈ ఉపసంహరణ ప్రక్రియ అత్యంత మానవతా దృక్పథంతో, సున్నితంగా జరగాలి. రోగికి నొప్పి తెలియకుండా, గౌరవప్రదంగా ఈ ప్రక్రియ ముగియాలి," అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ ప్రక్రియ కేవలం ఆసుపత్రుల్లోనే కాకుండా, అవసరమైతే ఇంట్లోనే నిర్వహించుకోవచ్చని సైతం క్లారిటీ ఇచ్చింది.

హరీష్ రాణా నేపథ్యం..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హరీష్ రాణా, పంజాబ్ యూనివర్సిటీ మాజీ విద్యార్థి. 2013లో తాను ఉంటున్న పీజీ హాస్టల్ నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను అపస్మారక స్థితిలో, మంచానికే పరిమితమై, కేవలం ట్యూబ్ల ద్వారా అందుతున్న ఆహారంతోనే ప్రాణాలతో ఉన్నాడు. పదేళ్లుగా అతడి మెదడు పనితీరులో ఎలాంటి మెరుగుదల లేదు.

ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ఎయిమ్స్ వైద్యులతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. హరీష్ 100% వికలాంగుడని, అతడు కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని ఆ బోర్డు నివేదిక ఇచ్చింది. తీర్పు ఇచ్చే ముందు కోర్టు హరీష్ కుటుంబంతో వ్యక్తిగతంగా మాట్లాడింది. తమ కుమారుడు ఇకపై నరకయాతన అనుభవించకూడదని వారు కన్నీళ్లతో కోరారు.

కేంద్రానికి సూచనలు, ఆదేశాలు..

కారుణ్య మరణం విషయంలో దేశంలో ప్రస్తుతం చట్టపరమైన శూన్యత ఉందని, దీనిపై తగిన చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అలాగే, ప్రతి జిల్లాలో చీఫ్ మెడికల్ ఆఫీసర్లు నిపుణులైన వైద్యులతో ప్యానెల్‌లను ఏర్పాటు చేయాలని, అవి కారుణ్య మరణం దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe