...
...
Next Story

Mojtaba Khamenei : ముదురుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్​ కీలక నిర్ణయం! సుప్రీం లీడర్​గా ఖమేనీ కుమారుడు..

Iran Israel War : ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అల్​ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ పగ్గాలు చేపట్టారు. మరోవైపు యుద్ధం తొమ్మిదో రోజుకు చేరిన వేళ, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఉధృతం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Published on: Mar 9, 2026, 05:47:10 IST
Advertisement

మధ్యప్రాచ్యంలో యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత అయతొల్లా అల్​ ఖమేనీ వారసుడిగా, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీని (56) నూతన సుప్రీం లీడర్​గా ఎంపిక చేసింది. ఇరాన్‌లోని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ నిర్వహించిన ఓటింగ్‌లో మోజ్తబా నిర్ణయాత్మక విజయం సాధించినట్లు వార్తా సంస్థ ‘ఫార్స్’ ఆదివారం వెల్లడించింది. కొత్త నాయకత్వానికి తాము పూర్తి విధేయతతో ఉంటామని ఇరాన్ విప్లవాత్మక దళం (ఐఆర్​జీసీ) ఇప్పటికే ప్రకటించింది.

గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులు.. ఇంధన నిల్వలే లక్ష్యం..

మొజ్తబా ఖమేనీ..
మొజ్తబా ఖమేనీ..

ఒకవైపు రాజకీయ మార్పులు జరుగుతుంటే, మరోవైపు పర్షియన్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ తన దాడులను ఉధృతం చేసింది. తాము నెలల తరబడి యుద్ధం చేయగలమని ఇరాన్ ప్రకటించడమే కాకుండా.. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఆదివారం రాత్రి కువైట్ గగనతలంలో మూడు బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశ రక్షణ దళాలు అడ్డుకున్నాయి. అయితే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన డిపోలపై డ్రోన్లు దాడి చేయడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. అటు బహ్రెయిన్‌లోని నీటి శుద్ధి కర్మాగారంపై కూడా డ్రోన్ దాడి జరిగింది.

ట్రంప్ హెచ్చరిక.. రంగంలోకి అమెరికా స్పెషల్ ఫోర్స్?

పరిస్థితి తీవ్రతను గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడులను మరింత విస్తృతం చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న అణు బాంబు తయారీకి వాడే ‘యురేనియం’ నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా తన స్పెషల్ ఫోర్స్‌ను రంగంలోకి దించే అవకాశం ఉందని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇరాన్ దాడులకు ధీటుగా ఇజ్రాయెల్ గగనతలం నుంచి విరుచుకుపడుతోంది. టెహ్రాన్ సమీపంలోని కుహక్, షహ్రాన్ ప్రాంతాల్లోని చమురు నిల్వ కేంద్రాలు, విద్యుత్ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. గడిచిన 24 గంటల్లో ఇరాన్​లోని సుమారు 400 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ పేలుళ్ల వల్ల వెలువడిన రసాయన వ్యర్థాల మేఘాల కారణంగా ‘విషపూరిత యాసిడ్ వర్షం’ కురిసే ప్రమాదం ఉందని రెడ్ క్రాస్/రెడ్ క్రెసెంట్ హెచ్చరించింది. దీనితో టెహ్రాన్ ప్రజలు మాస్కులు ధరించాలని, ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు.

భగ్గుమంటున్న చమురు ధరలు.. మార్కెట్ల పతనం!

యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్​లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర ఒక్క రోజే 22 శాతం పెరిగి 111.24 డాలర్లకు చేరగా, బ్రెంట్ క్రూడ్ 110 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ మూతపడే అవకాశం ఉండటంతో యూఏఈ, కువైట్ తమ ఉత్పత్తిని తగ్గించాయి.

దీనివల్ల అమెరికాలో గ్యాసోలిన్ ధరలు 2024 సెప్టెంబర్ తర్వాత గరిష్ట స్థాయికి చేరాయి. ఇటు అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోగా, డాలర్ విలువ పెరిగింది.

అటు చమురు దిగ్గజం ‘సౌదీ అరామ్కో’ షేర్లు మాత్రం యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరల కారణంగా 4.9 శాతం లాభపడ్డాయి.

ముందుంది సుదీర్ఘ పోరు?

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతూనే, మరోవైపు దాడులను కొనసాగిస్తున్నారు. తాము కనీసం ఆరు నెలల పాటు ఇదే తీవ్రతతో యుద్ధం చేయగలమని, రానున్న రోజుల్లో ఇప్పటి వరకు వాడని అత్యాధునిక లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగిస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.

ప్రస్తుతానికి మధ్యప్రాచ్యం ఒక అగ్నిగుండంలా మారింది. ఇంధన సరఫరా నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks