...
...
Next Story

Three language policy : '9వ తరగతిలో మూడో భాషా? విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి'- వద్దన్న సుప్రీంకోర్టు..

Supreme court CBSE : 9వ తరగతి విద్యార్థులపై అదనపు భారం మోపుతూ సీబీఎస్ఈ తీసుకొచ్చిన త్రిభాషా సూత్రంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షల ఒత్తిడి ఉండే ఈ దశలో కొత్త భాషను రుద్దడం సరికాదని, అవసరమైతే 6వ తరగతి నుంచే ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది.

Published on: Jul 16, 2026 01:10 PM IST
Advertisement

పాఠశాల విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించాలంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 9వ తరగతి స్థాయిలో అదనంగా మూడో భాషను తప్పనిసరి చేయాలన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) నిర్ణయాన్ని గురువారం అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పటికే బోర్డు పరీక్షల కోసం సిద్ధమవుతూ తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొనే విద్యార్థులపై ఇలాంటి నిబంధనలు రుద్దడం వల్ల, వారిపై లేనిపోని అకాడమిక్ భారం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. కొత్త భాషను నేర్పించాలనుకుంటే 6వ తరగతి నుంచే ఎందుకు ప్రారంభించకూడదని ప్రశ్నించింది.

మూడో భాష విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యాలు..
మూడో భాష విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యాలు..

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని సీబీఎస్ఈ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత కొన్ని రోజులుగా ఈ నిబంధనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హఠాత్తుగా కొత్త భాషను నేర్చుకోవాల్సి రావడం వల్ల 10వ తరగతి బోర్డు పరీక్షల మార్కులపై ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనంగా మారాయి.

జస్టిస్ నాగరత్న సొంత అనుభవాల ప్రస్తావన..

ప్రతి జిల్లాలో జవాహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేయాలంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆసక్తికరమైన చర్చ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. 9వ తరగతి నుంచే మూడో భాష తప్పనిసరి అవుతుందని తమిళనాడు తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా, జస్టిస్ నాగరత్న వెంటనే స్పందించారు.

"తొమ్మిదో తరగతిలో కొత్త భాషను తీసుకురావడం అత్యంత దారుణం. 9వ తరగతి అంటేనే విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయం. 8వ తరగతి ముగిసినప్పటి నుంచే టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ టెన్షన్ మొదలవుతుంది. కొత్తగా ఏదైనా భాషను నేర్పించాలనుకుంటే 6వ తరగతి నుంచే ప్రారంభించాలి," అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు.

ఈ సమస్యపై జస్టిస్ నాగరత్న నేరుగా కేంద్ర ప్రభుత్వానికి, విద్యా సంస్థలకు ఒక కీలక సూచన చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈతో పాటు అన్ని రాష్ట్రాల విద్యా బోర్డులు కూడా 9వ తరగతిలో కొత్త భాషలను ప్రవేశపెట్టే విధానానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.

నిజానికి, మే 15న సీబీఎస్ఈ జారీ చేసిన ఒక సర్క్యులర్ ద్వారా ప్రస్తుత విద్యాసంవత్సరం (జులై 1, 2026) నుంచి 9వ తరగతి విద్యార్థులకు మూడు భాషలను తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. కనీసం కొత్త పాఠ్యపుస్తకాలు కూడా అందుబాటులో లేకపోవడంతో, తాత్కాలికంగా 6వ తరగతి పుస్తకాలనే చదవాలని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో, జూన్ 29న బోర్డు ఒక మెట్టు దిగింది. ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు కొంత సడలింపు ఇస్తూ.. ఈ మూడో భాషకు కేవలం అంతర్గత మూల్యాంకనం మాత్రమే ఉంటుందని, 10వ తరగతి ప్రధాన బోర్డు పరీక్షల్లో దీనిని చేర్చబోమని స్పష్టం చేసింది.

హిందీ రుద్దడం లేదు.. కేంద్ర పథకాలను వ్యతిరేకించకండి!

తమిళనాడు ప్రభుత్వం చాలా కాలంగా రెండు భాషల విధానాన్ని (తమిళం, ఇంగ్లీష్) మాత్రమే సమర్థిస్తూ, కేంద్ర ప్రభుత్వ నవోదయ పాఠశాలల్లో ఉండే త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తోంది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ విధానంలో ఎక్కడా హిందీని కచ్చితంగా నేర్చుకోవాలని చెప్పడం లేదని గుర్తు చేసింది. రాష్ట్ర భాష, ఇంగ్లీష్‌తో పాటు మరేదైనా మూడో భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు.

తమిళనాడు న్యాయవాదిని ఉద్దేశించి.. "మీకు హిందీ వద్దు సరే, ఒకవేళ అది సంస్కృతం అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి?" అని ప్రశ్నించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అనే ఒకే ఒక్క కారణంతో రాష్ట్రాలు వాటిని తిరస్కరించడం సరికాదని, మీ సొంత విద్యా విధానం మీకు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో రాకుండా అడ్డుకోవద్దని బెంచ్ హితవు పలికింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అంశంపై సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నందున, తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 11కు వాయిదా వేసింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe